
సౌత్ క్యాంపస్లో సంబురాలు
తెయూ(డిచ్పల్లి) : తెయూలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు ‘సాక్షి’ తనవంతు కృషి చేసింది. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి నిజామాబాద్ జిల్లాను సందర్శించిన సమయంలో తెయూకు ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేస్తామని ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ ప్రత్యేక కథనాలను ప్రచురించింది. 12 ఏప్రిల్ 2025న ‘సాక్షి’ టౌన్ ఆఫీస్లో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ‘తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలి’ అనే అంశంపై చర్చాగోష్టి నిర్వహించింది. ప్రభుత్వం కళాశాల మంజూరు చేస్తే చాలు తాము నడిపేందుకు సిద్ధంగా ఉన్నా మని జూన్ 24న వర్సిటీని సందర్శించిన ఉన్న త విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి దృష్టికి వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి తీసుకెళ్లారు. జూలై 8న ‘మంజూరు చేస్తే చాలు’ అనే కథనాన్ని ‘సాక్షి’ ప్రచురించింది. 577 విశాలమైన క్యాంపస్తోపాటు సైన్స్ కాలేజ్ భవనం, మౌలిక వసతులు, ఫ్యాకల్టీ అందుబాటులో ఉన్నాయంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఇలా తెయూలో ఇంజినీరింగ్ కళాశాల మంజూరు విషయంలో కృషి చేసిన ‘సాక్షి’ దినపత్రికకు పలువురు విద్యార్థి సంఘాల నాయకులు, విద్యావేత్తలు గురువారం ఫోన్లు చేసి కృతజ్ఞతలు తెలిపారు.
భిక్కనూరు: తెలంగాణ వర్సిటీకి ఇంజినీరింగ్ కళాశాల మంజూరు కావడాన్ని హర్షిస్తూ డాక్టరేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు గురువారం సౌత్ క్యాంపస్లో సంబురాలు జరుపుకున్నారు. ఎన్నో ఏళ్ల కల నేరవేరిందని డాక్టరేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్గౌడ్ అన్నారు. ప్రభుత్వం ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
విద్యార్థులు బాణాసంచా కాల్చి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుధాకర్గౌడ్, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి, డాక్టరేట్ అసోసియేషన్ ప్రతినిధులు రాహుల్ నేత, సరిత, సత్యం, రమేశ్, అధ్యాపకులు అంజయ్య, మోహన్బాబు, యాలాద్రి తదితరులు పాల్గొన్నారు.

సౌత్ క్యాంపస్లో సంబురాలు