
సరిహద్దు తేల్చాలి
రుద్రూర్: పోతంగల్ మండలంలోని మంజీరా నది నుంచి ఇసుక తరలించే కొడిచర్ల, పోతంగల్కు చెందిన ట్రాక్టర్ యజమానులు సోమవారం తహసీల్ కార్యాలయానికి తరలి తరలివచ్చారు. మంజీర నుంచి ఇసుక తరలించే శివారు సరిహద్దు తేల్చాలని కొడిచర్ల గ్రామస్తులు డిమాండ్ చేశారు. పోతంగల్ వే బిల్లు తీసుకుని కొడిచర్ల శివారు నుంచి ఇసుక తీసుకెళుతున్నారని ఫిర్యాదు చేశారు. తమ శివారు నుంచి ఇసుక తరలింపును నిలిపివేయాలని తహసీల్దార్ గంగాధర్కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన తహసీల్దార్ ఇసుక ట్రాక్టర్లను నిలిపివేశారు. స్థానికంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారుల వివరాలు సేకరించి అవసరమగు వారికి సరఫరా చేయాలని జీపీ కార్యదర్శికి సూచించారు.
ఎన్డీఎస్ఎల్ను పునరుద్ధరించాలి
నిజామాబాద్ అర్బన్: ఎన్డీఎస్ఎల్ను వెంటనే పునరుద్ధరించాలని ఎంసీపీఎం నాయకులు సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యదర్శి మైత్రి రాజశేఖర్ మాట్లాడుతూ చక్కెర కార్మాగారం మళ్లీ ప్రారంభిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేకమందికి ఉపాధి కలుగుతుందన్నారు. సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యంతోనే ఈ ఫ్యాక్టరీ నష్టాలు ఊబిలోకి వెళ్లిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఫ్యాక్టరీని పునరుద్ధరించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సామెల్ నరసయ్య, అంజయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
ముంపు గ్రామాల
ప్రజలను ఆదుకోండి
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో ముంపునకు గురైన గ్రామాల ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో దేశ తొలి ప్రధాని నెహ్రూ ఫొటో, ప్రాజెక్ట్ నిర్మాణ కాలంలో ప్రభుత్వాలు ఇచ్చిన పరిహారం, హామీలతో కూడిన ఓ పోస్టు వైరల్ అవుతోంది. అందులోని సారాంశం ఇదే.. ‘శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు 1963లో దేశ తొలి ప్రధాని నెహ్రూ శంకుస్థాపన చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన 36 గ్రామాలు, ఆదిలాబాద్ జిల్లా (ప్రస్తుతం నిర్మల్ జిల్లా)కు చెందిన 56 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఆకాలంలో ఎకరానికి రూ.600, ఇంటికి రూ.5 వేలలోపు పరిహారం అందించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకూ ఇవ్వలేదు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలి’ అని పేర్కొన్నారు.
తాళాలు వేసిన
మూడు ఇళ్లలో చోరీ
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలో మూడు ఇళ్లలో ఆదివారం అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. మద్నూర్కు చెందిన లైబ్రెరియన్ కపిల్ కుటుంబసభ్యులు కామారెడ్డికి వెళ్లడంతో ఇంటికి తాళం వేశారు. దుండగులు తాళాలను పగులగొట్టి ఇంట్లో దాచిపెట్టిన రూ. 40 వేల నగదు అపహరించుకు వెళ్లారు. సోమవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు కపిల్ తెలిపారు. కాలనీలోని మరో రెండు ఇళ్ల తాళాలను దుండగులు పగులగొట్టారని స్థానికులు తెలిపారు. కాగా, నలుగురు వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యిందని పేర్కొన్నారు.

సరిహద్దు తేల్చాలి

సరిహద్దు తేల్చాలి