
ధైర్యం ధర్మాస్పత్రి!
హలో.. ఆస్పత్రికి రండి
ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు
జీవితంపై కొత్త ఆశలు
● పాలియేటివ్ కేర్ సెంటర్,
క్యాన్సర్ వార్డుల్లో చికిత్స
● పేద, మధ్య తరగతికి భారీ ఊరట
● త్వరలో అధికారికంగా క్యాన్సర్
వార్డు ప్రారంభం
● ప్రాథమికంగా అందుతున్న చికిత్స
నిజామాబాద్నాగారం: జిల్లాలో సుమారు 1200 మందికిపైగా క్యాన్సర్ బారినపడినట్లు అధికారిక లెక్కలు పేర్కొంటున్నాయి. వారంతా జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులు లేదా హైదరాబాద్లోని ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు. కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ చేయించుకోవడం, ఖరీదైన మందులు కొనుగోలు చేయడం చాలా కుటుంబాలపై ఆర్థికంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే క్యాన్సర్ రోగులకు వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి చికిత్స అందించేందుకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో ఏడాది క్రితం ప్రారంభించిన పాలియేటివ్ కేర్ సెంటర్లోనే ప్రత్యేకంగా క్యాన్సర్ వార్డును ఏర్పాటు చేశారు.
ప్రారంభమైతే అన్ని రకాల వైద్యం..
జీజీహెచ్ ఆవరణలో క్యాన్సర్ వార్డు అధికారికంగా ప్రారంభమైతే రోగులకు అవసరమైన అన్నిరకాల వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్ప టికే క్యాన్సర్ బారిన పడిన రోగులకు చికిత్స అందిస్తున్నారు. అధికారికంగా ప్రారంభమైన తరువాత రోగులకు కీమో థెరీపీ, రేడియేషన్ థెరపీ చేయడంతోపాటు అన్ని రకాల మందులు అందించనున్నారు. ఇది అన్నివర్గాల వారికి పెద్ద ఊరటనిచ్చే అంశం.
జీజీహెచ్ ఆవరణలో ఏర్పాటైన క్యాన్సర్ వార్డు అధికారికంగా ప్రారంభం కాలేదు. అయినప్పటికీ క్యాన్సర్ రోగుల ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తున్న వైద్య సిబ్బంది ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్స అందిస్తున్నారు. రోగులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సిబ్బంది ఫోన్లు చేసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. కీమో, రేడియేషన్ థెరపీ కారణంగా చేయించుకున్న తరువాత వచ్చే తీవ్ర నొప్పులు, వీక్నెస్, ఇతర సైడ్ ఎఫెక్ట్లకు క్యాన్సర్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. అవసరమైన వారికి ఫిజియోథెరపీ, డ్రెస్సింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం 10 బెడ్లు ఉన్నాయి. హైదరాబాద్లోని ఎంఎన్జే, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్న వారికి ఆ తరువాత సైడ్ ఎఫెక్ట్స్, నొప్పులు, ఇతర సమస్యలు వస్తే జీజీహెచ్కు వెళ్లాలని అక్కడి వైద్యులు రిఫర్ చేస్తున్నారు.
వైద్యులు.. సిబ్బంది
ప్రస్తుతం క్యాన్సర్ వార్డులో వైద్య నిపుణులు చైతన్యతోపాటు ఫిజియోథెరపిస్ట్, నలుగురు స్టాఫ్ నర్సులు, ఇద్దరు చొప్పున అటెండర్లు, ఆయాలు, వాచ్మెన్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటి నుంచే 24 గంటలపాటు వార్డు అందుబాటులో ఉంటోంది.

ధైర్యం ధర్మాస్పత్రి!