
ఎంపీ అర్వింద్ కృషి ఫలితమే ‘కొత్త రైల్వేలైన్’
సుభాష్నగర్: ఆర్మూర్ మీదుగా ఆదిలాబాద్–పటాన్చెరు మధ్య కొత్త రైల్వేలైన్ ప్రాజెక్టు ఎంపీ అర్వింద్ ధర్మపురి కృషికి ఫలితమేనని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఒక ప్రకటనలో తెలిపారు. రెండేళ్లుగా ఎంపీ అర్వింద్ ఈ రైల్వేలైన్ ప్రాజెక్టు మంజూరు కోసం రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశారన్నారు. 250 కిలోమీటర్ల పొడవైన ఈ నూతన రైలు మార్గం నిర్మల్, నిజామాబాద్, బోధన్, సంగారెడ్డి వంటి కీలక ప్రాంతాలను కలుపుతుందన్నారు. పటాన్చెరు, సంగారెడ్డి ప్రాంతాల్లో అధిక సంఖ్యలో పరిశ్రమలు ఉన్నందున పారిశ్రామిక, వ్యవసాయ, వాణిజ్య రంగాల అభివృద్ధికి ఈ లైన్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. రైల్వేలైన్ను మంజూరు చేసిన రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్, చొరవ తీసుకున్న ఎంపీ అర్వింద్ ధర్మపురికి జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు.
ఇక ఏపీఎంల బదిలీలు ●
డొంకేశ్వర్(ఆర్మూర్): పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో డీపీఎంల వరకు జరిగి నిలిచిన బదిలీలు తిరిగి మొదలయ్యాయి. నెల రోజులుగా ఎదురుచూస్తున్న ఏపీఎంలకు బదిలీల షెడ్యూల్ విడుదలైంది. జిల్లాకు ఏపీఎంలను కేటాయించిన సెర్ప్ ఉన్నతాధికారులు వారి సీనియారిటీ లిస్టును సైతం పంపించారు. బుధ, గురువారాల్లో ఆప్షన్లు రాసి జిల్లా కార్యాలయంలో అందజేశారు. మొత్తం 31 మంది ఏపీఎంల బదిలీలకు శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కౌన్సెలింగ్లో కోరుకున్న మండలాలను కేటాయించి 26న పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వనున్నారు. 31న పాత మండలాల నుంచి రిలీవ్ అయ్యి ఆగస్టు 1న కొత్తగా పోస్టింగ్ ఇచ్చిన మండలాల్లో రిపోర్టు చేయాలని సెర్ప్ నుంచి ఆదేశాలున్నాయి. ఐతే, ఏపీఎంలలో కొందరు కోరుకున్న ప్రాంతాలకు వెళ్లాలనే పట్టుదలతో పైరవీలు సైతం చేసినట్లు వినిపిస్తున్నాయి.
సీసీలు, ఇతర సిబ్బందికి కూడా వెంటనే..
ఏపీఎంల బదిలీలు, కొత్త మండలాల్లో పోస్టింగ్ల ప్రక్రియ నెలాఖరుతో ముగియనుంది. అనంతరం సీసీలు, ఇతర సిబ్బందికి కూడా వెంటనే బదిలీలు చేపట్టాలని సెర్ప్ ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు నాలుగైదు రోజుల్లో షెడ్యూల్ విడుదల చేసే అవకాశమున్నట్లు ఉద్యోగవర్గాలు పేర్కొంటున్నాయి. సీసీలు, ఇతర సిబ్బంది ఇది వరకే ఆప్షన్లు పెట్టుకోగా కౌన్సెలింగ్ చేయడమే ఆలస్యమంటున్నారు.
సమగ్ర శిక్షలో బదిలీలకు గ్రీన్సిగ్నల్..
ఆర్మూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా నిర్వహిస్తున్న సమగ్ర శిక్షలో ఎట్టకేలకు బదిలీల పర్వం ప్రారంభమైంది. భార్య, భర్తలు ఉద్యోగులుగా ఉన్న పక్షంలో వారిలో ఒకరిని బదిలీ చేయడానికి, మ్యూచ్వల్ అండర్ స్టాండింగ్తో బదిలీలకు అనుమతినిస్తూ సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో భార్యభర్తలు ఇతర జిల్లాల్లో విధులు నిర్వహిస్తూ ఇబ్బందులు పడుతున్న వారికి సమస్య పరిష్కారం కానుంది. బదిలీ లు కోరే ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
● షెడ్యూల్ విడుదల ● నేడు కలెక్టరేట్లో కౌన్సెలింగ్