
‘నషా ముక్త్ భారత్ అభియాన్’ను విజయవంతం చేయాలి
నిజామాబాద్అర్బన్: మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా జిల్లాలో ఈ నెల 20 నుంచి 26 వరకు నిర్వహించనున్న నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం రూపొందించిన వాల్పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్ బీ, అదనపు డీసీపీ బస్వారెడ్డి, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిజామాబాద్ జోన్ డీఎస్పీ సోమనాథం, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి రాజశ్రీ, డీఐఈవో రవికుమార్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.