
పనిలో పోటీతత్వానికే ‘పోలీస్ డ్యూటీ మీట్’
ఖలీల్వాడి: విధినిర్వహణలో సామర్థ్యం పెంచడానికి పోలీస్ డ్యూటీ మీట్ ఉపయోగపడుతుందని సీపీ పోతరాజు సాయిచైతన్య పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలోని వివిధ విభాగాల వారికి శుక్రవారం ఎంపిక పోటీలు నిర్వహించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో సీఐలు, ఎస్సైలకు నిర్వహించిన పరీక్షలను సీపీ ప్రారంభించి మాట్లాడారు. ఈ పోటీల ద్వారా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ స్థాయి నుంచి ఏసీపీ స్థాయి వరకు పని పద్ధతులు మెరుగుపడుతాయని, ఇన్వెస్టిగేషన్ స్థాయిలు పెరిగి, పనిలో పోటీతత్వం అలవడుతుందన్నారు. అనంతరం సైంటిఫిక్, ఫింగర్ ప్రింట్ ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్ సైన్స్ ఫింగర్ ప్రింట్, లిఫ్టింగ్, ప్యాకింగ్, ఐవో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలపై పరీక్షలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్రస్థాయిలో జరిగే డ్యూటీ మీట్కు పంపిస్తామని సీపీ తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి , సీసీఎస్ ఏసీపీ నాగేంద్రచారి, ఏసీపీ రవీందర్ రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
సీపీ పోతరాజు సాయిచైతన్య