ఆర్మూర్టౌన్: పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం రైతులు, స్థానికులు ఓ దొంగను పట్టుకొని దేహశుద్ధి చేశారు. పట్టణంతోపాటు మండలంలోని గ్రామాల్లో గల వ్యవసాయ బోర్ మోటార్లను నిందితుడు దొంగిలించి, ఓ స్క్రాప్ దుకాణం వద్ద విక్రయించడానికి యత్నించాడు. స్థానికులు అతడిని గమనించి పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. నిందితుడు దొంగిలించిన మోటార్లను రైతులకు అప్పగించాలని పోలీసులను కోరారు.
ట్రాక్టర్ బోల్తా: ముగ్గురికి గాయాలు
రామారెడ్డి: మండలంలోని మద్దికుంట–రామారెడ్డి గ్రామాల మధ్య గురువారం ఓ ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో మద్దికుంట గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు గాయాలైనట్లు సమాచారం. స్థానికులు క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు రాలేదని ఎస్సై రాజారాం తెలిపారు.
ఇంటికి నిప్పు
నందిపేట్ (ఆర్మూర్): మండల కేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఓ ఇంట్లో మంటలు వ్యాపించి సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. సదరు ఇంట్లో నివాసం ఉంటున్న కోయల్కర్ లావణ్య మూడు రోజుల క్రితం ఆదిలాబాద్లోని వారి బంధువుల ఇంటికి వెళ్ళింది. కాగా గురువారం అర్ధరాత్రి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించి, ఇంట్లోని వస్తువులకు నిప్పుపెట్టారు. ఈ మేరకు లావణ్య శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.
భార్య ఆత్మహత్యకు కారణమైన
భర్తకు పదేళ్ల జైలు శిక్ష
నిజామాబాద్ లీగల్: అదనపు కట్నం కోసం భార్యను వేధించి, ఆమె ఆత్మహత్యకు కారణమైన భర్తకు నిజామాబాద్ సెషన్స్ కోర్టు జడ్జి జివిఎన్ భరతలక్ష్మి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్రెడ్డి తెలిపిన వివరాలు ఇలా.. డిచ్పల్లి మండలం ఘన్పూర్కు చెందిన షేక్ ఇద్రీస్కు నడిపల్లికి చెందిన ఫౌజియా బేగంతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్ని నెలల తర్వాత భర్త, అత్త అదనపు కట్నం కోసం ఫౌజియాను వేధించడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. పుట్టింటి వారికి అదనపు కట్నం ఇచ్చే స్థోమత లేకపోవడం, అత్తింటి వారి వేధింపులు భరించలేక ఫౌజియా 2021లో తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి పుట్టింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా భర్త, అత్త, బావలపై కేసు నమోదు చేసి కోర్టుకు పంపారు. విచారణ చేపట్టిన జడ్జి మృతురాలి భర్త షేక్ ఇద్రీస్కు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అత్త కేసు విచారణ దశలో ఉండగా మృతి చెందగా, బావ షేక్ అలీని నిర్దోషిగా ప్రకటించింది.
డ్రంకెన్డ్రైవ్లో ముగ్గురికి..
ఖలీల్వాడి: నగరంలో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా, 16 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారికి నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట వారిని హాజరుపరచగా 13మందికి రూ. 18వేల జరిమానా విధించారు. ఇద్దరికి మూడు రోజులు, ఒకరికి రెండు రోజుల జైలు శిక్ష విధించారు.
బోర్ మోటార్ల దొంగకు దేహశుద్ధి
బోర్ మోటార్ల దొంగకు దేహశుద్ధి