
ఎన్పీఏ 7.81 శాతానికి తగ్గింది
● ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్
కుంట రమేశ్రెడ్డి
● నగరంలో డీసీసీబీ వార్షిక
మహాజనసభ
సుభాష్నగర్: నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎన్పీఏ (నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్) 14 శాతం నుంచి 7.81 శాతానికి తగ్గిందని ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి తెలియజేశారు. జిల్లా కేంద్రంలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం 103వ వార్షిక మహాజనసభ నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి ఈ సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించినందుకుగాను మహాజనసభ ధన్యవాదాలు తెలిపింది. బ్యాంకు సాధించిన ప్రగతి వివరాలను సీఈవో నాగభూషణం వివరించారు. అనంతరం రమేశ్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్పీఏ తగ్గించేందుకు సొసైటీ చైర్మన్లు, సీఈవోలు, బ్యాంకు సిబ్బంది విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఉమ్మడి జిల్లాలో 50 శాతంకు పైగా సొసైటీలు 50 శాతానికిపైగా రుణాలు వసూలు చేసి బ్యాంకు అభివృద్ధికి పాటుపడ్డాయని పేర్కొన్నారు. ఇందుకుగాను ప్రతి సహకార సంఘానికి వారి షేర్ క్యాపిటల్లో 2 శాతం డివిడెండ్ను ప్రకటిస్తున్నామన్నారు. కాగా పెండింగ్లో ఉన్న ధాన్యం కమీషన్, ఉమ్మడి జిల్లాలో యూరియా కొరతపై సొసైటీ చైర్మన్లు ఆయన దృష్టికి తీసుకవచ్చారు. ఈ విషయమై మంత్రి, ప్రిన్సిపల్ సెక్రెటరీతో ఇదివరకే మాట్లాడినట్లుగా రమేష్రెడ్డి తెలిపారు. అనంతరం బ్యాంకు అభివృద్ధికి కృషి చేసిన సొసైటీ చైర్మన్లను ఘనంగా సన్మానించారు. వైస్ చైర్మన్ నల్ల చంద్రశేఖర్రెడ్డి, డైరెక్టర్లు, ఉమ్మడి సొసైటీ చైర్మన్లు, డీసీవో శ్రీనివాస రావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.