
ఉత్తర్వులిచ్చారు.. ఆప్షన్ మరిచారు
మోర్తాడ్(బాల్కొండ): ఆసరా పథకం కింద బీడీ కార్మికులకు అందిస్తున్న జీవనభృతికి గతంలో నిర్ణయించిన కటాఫ్ తేదీ నిబంధన ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కానీ, ఆన్లైన్లో నమోదుకు సంబంధించిన వెబ్పోర్టల్లో మాత్రం ఆప్షన్ ఇవ్వలేదు. ఫలితంగా అనేక మంది బీడీ కార్మికులు ఆసరా అందుకోలేకపోతున్నారు.
జిల్లాలో దాదాపు 2.50 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. వీరిలో 96,264 మందికి మాత్రమే జీవనభృతి అందుతోంది. 20 వేల దరఖాస్తులు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) కార్యాలయంలో పెండింగ్లో ఉన్నాయి. మరో 50 వేల మంది బీడీ కార్మికులు భృతి కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. 2014 ఫిబ్రవరి తర్వాత అనేక మంది బీడీ కార్మికులు పీఎఫ్ ఖాతాలను పొందారు. వీరందరికీ జీవనభృతి అందించాల్సి ఉంది. పథకం అమలు చేసిన సమయంలో 28 ఫిబ్రవరి 2014ను కటాఫ్ తేదీగా గత ప్రభుత్వం నిర్ణయించి ఆ తేదీలోపు పీఎఫ్ ఖాతాలు పొందినవారికే జీవనభృతి అమలు చేసింది. ఆ తర్వాత పీఎఫ్ ఖాతాలు పొందిన వారికి జీవనభృతి అందలేదు. దీంతో కటాఫ్ తేదీని సవరిస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం వెల్లడించి ఉత్తర్వులను జారీ చేసింది. కానీ, ఆచరణలో మాత్రం అమలు చేయలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మెనిఫెస్టోలో బీడీ కార్మికులకు ప్రయోజనం కలిగించేలా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. తాము అధికారంలోకి రాగానే కొత్తగా జీవనభృతి మంజూరు చేయడంతోపాటు బీడీ కార్మికులకు ఇస్తున్న రూ.2,016 కాకుండా మరో రెండు వేలు పెంచి రూ.4,016 ను ప్రతి నెలా అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. సీఎంగా రేవంత్రెడ్డి పదవీ బాధ్యతలను స్వీకరించి ఏడాదిన్నర గడిచినా జీవనభృతి ఊసే లేదు. కొత్త పింఛన్ల మంజూరు, డబ్బుల పెంపు విషయాల్లో స్పష్టత లేకపోవడంతో బీడీ కార్మికుల్లో అయోమయం నెలకొంది. ఇప్పటికై నా ఎన్నికల హామీని అమలు చేయాలని బీడీ కార్మిక సంఘాలు, కార్మికులు కోరుతున్నాయి.
జీవనభృతికి నోచుకోని బీడీ కార్మికులు
కటాఫ్ తేదీని ఎత్తివేసినా
లభించని ప్రయోజనం

ఉత్తర్వులిచ్చారు.. ఆప్షన్ మరిచారు