
పూడుకుపోయిన నిజాంసాగర్ ఉపకాలువ
నవీపేట: మండలంలో పూడుకుపోయిన నిజాంసాగర్ ఉపకాలువ పూడుకుపోవడంతో కాలువ కింది రైతులు సొంత ఖర్చులతో మరమ్మతులు చేపట్టారు. మండలంలోని కమలాపూర్, నాడాపూర్ గ్రామాలకు విస్త్తరించుకున్న నిజాంసాగర్ డి 50/4/10 ఉప కాలువతో పాటు కాలువ గట్టు (కెనాల్ ఇన్స్పెక్షన్ పాత్) ఇరువైపులా పూడుకుపోయింది. గత కొన్నేళ్లుగా మరమ్మతులు లేకపోవడంతో ఇరువైపులా నడకకు అనుకూలంగా ఉన్న రోడ్డు చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు, చెట్లు, గుంతలతో కూరుకుపోయింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కాలువ కింది 250 ఎకరాల పరిధిలోని రైతులు ముందడుగు వేశారు. చదునుతోపాటు కాలువలోని పూడికను తొలగించేందుకు సంకల్పించిన రైతులు రూ. 2.70 లక్షల నగదును జమ చేశారు. ఆదివారం రైతులందరూ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని చకచకా పనులకు శ్రీకారం చుట్టారు. రెండున్నర కిలోమీటర్ల మేర పొక్లెయిన్తో చెట్లు, పొదలు, చెత్తాచెదారం, గుంతలను తొలగించి చదును చేశారు. పైపులైన్ను విస్తరించారు. పూర్తి మరమ్మతులకు అదనంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు.
సొంత ఖర్చులతో మరమ్మతులు
చేపట్టిన అన్నదాతలు