
నర్సయ్య పోరాటస్పూర్తితో బలమైన ఉద్యమాలను నిర్మిద్దాం
డిచ్పల్లి: అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) జిల్లా మాజీ గౌరవ అధ్యక్షులు, అమరుడు కామ్రేడ్ నాయక్వాడి నర్సయ్య పోరాటస్ఫూర్తితో బలమైన రైతాంగ ఉద్యమాలను నిర్మిద్దామని సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ మండల కార్యదర్శి జేపీ గంగాధర్ పేర్కొన్నారు. డిచ్పల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం మెంట్రాజ్పల్లి గ్రామంలో కామ్రేడ్ నర్సయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జేపీ గంగాధర్ మాట్లాడుతూ.. నిజాంసాగర్ ఆయకట్టు కోసం జరిగిన రైతు ఉద్యమం, సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ పునఃప్రారంభించాలని జరిగిన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు. నర్సయ్య మరణం రైతు, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు వాసరి సాయినాథ్, పీవోడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుప్రియ, ఎన్.లక్ష్మి, శాంత, మేకల రాజమణి, పాండు, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.