
ఫార్మర్ రిజిస్ట్రీలో నందిపేట ముందంజ
నందిపేట్(ఆర్మూర్): కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలనే లక్ష్యంలో భాగంగా రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అగ్రిస్టాక్ తెలంగాణ ఫార్మర్ ఈ రిజిష్ట్రీలో రైతుకు ఉన్న భూముల వివరాలను నమోదు చేసే ప్రక్రియను జూన్ 5 నుంచి వ్యవసాయ శాఖ అధికారులు ప్రారంభించారు. కాగా ఈ యాప్లో నమోదు ప్రక్రియలో భాగంగా నందిపేట మండలం ముందంజలో ఉంది. వ్యవసాయ శాఖ అధికారులు రైతుల వారీగా వివరాలను అత్యధికంగా నమోదు చేయడంతో జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచింది. అంతేగాకుండా రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంది.
రైతుల వివరాలు నమోదు
నందిపేట మండలంలో మొత్తం రైతులు 11,282 మంది ఉండగా ఇప్పటి వరకు 7008 మంది రైతుల వివరాలను 62.12 శాతం ఏఈవోలు యాప్లో నమోదు చేశారు. క్లస్టర్ల పరిధిలోని గ్రామాల వారీగా ఏఈవోలు ప్రతి రోజు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తూ రైతుల వివరాలను సేకరిస్తున్నారు. రైతు ఆధార్కార్డు, పట్టదారు పాసుపుస్తకంలోని భూముల వివరాలు, యాప్లో నమోదు చేయగానే 11 నంబర్ల ప్రత్యేక యూనిక్ కోడ్ కెటాయిస్తున్నారు. అయితే యాప్లో నెలకొన్న సాంకేతిక సమస్యలతో రైతుల వివరాలను నమోదు చేసేందుకు ఏఈవోలు పడరాని పాట్లు పడుతున్నారు. రైతులకు చెందిన భూముల సమాచారం యాప్లో కనిపించకపోవడంతో వివరాలను నమోదు చేసే ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. అదేవిధంగా రైతుల సెల్ఫోన్లలో ఓటీపీ నంబరు రాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆధార్కు లింక్ చేసిన ఫోన్ నంబరును రైతులు వాడకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని ఏఈవోలు పేర్కొంటున్నారు. నిర్ణీత గడువుకు ముందే నమోదు చేసేందుకు ఏఈవోలు వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. అయితే పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ, మట్టి నమూనాల సేకరణతో పాటు రైతు ముంగిట్లో వ్యవసాయం కార్యక్రమాలలో కొంత జాప్యం ఏర్పడుతుంది.
నందిపేట మండలంలో ఫార్మర్ రిజిస్ట్రీ యాప్ వివరాలు
జిల్లాలో ప్రథమ స్థానం, రాష్ట్రంలో
రెండో స్థానం
అన్ని గ్రామాల్లో వివరాలు నమోదు
ఏఈవోలు అన్ని గ్రామాలలో రైతుల వివరాలను ఫార్మర్ రిజిస్ట్రీ యాప్లో నమోదు చేస్తున్నారు. గడువుకు ముందే రైతులందరి వివరాలను నమో దు చేయాలనే లక్ష్యంతో ఏఈవోలు పనిచేస్తున్నారు. కొన్ని సాంకేతిక కారణాలతో వివరాల నమోదులో జాప్యం ఏర్పడుతోంది. – జోత్స్న భవాని,
మండల వ్యవసాయాధికారిణి, నందిపేట