
మత్తు పదార్థాల నిరోధానికి కృషి చేయాలి
నిజామాబాద్ అర్బన్: ప్రతిఒక్కరూ మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి కృషి చేయాలని, వీటిపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. ఈమేరకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో రూపొందించిన గోడ ప్రతులు, కరపత్రాలను బుధవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తన ఛాంబర్లో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ అనేక చర్యలు చేపడుతోందన్నారు. ఎక్కడైనా గంజాయి, క్లోరల్ హైడ్రేట్, డైజోఫామ్, అల్ఫ్రాజోలం వంటి వాటి రవాణా, విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సంబంధిత శాఖల అధికారులకు సమాచారం అందించాలని, టోల్ ఫ్రీ నంబర్ 1908కు ఫోన్ చేసి సమాచారం తెలియజేయవచ్చన్నారు. నిజామాబాద్ జోన్ డీఎస్పీ సోమనాథం మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో సుమారు రూ. 42.98 కోట్ల విలువ చేసే ఆల్ఫ్రాజోలం నిల్వలను సీజ్ చేసినట్లు తెలిపారు. జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.