
‘రూరల్‘లో మౌలిక సౌకర్యాలు కరువు
డిచ్పల్లి: డిచ్పల్లి మండలంలోని మిట్టపల్లిలో ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. నూతన పాఠశాల భవనం నిర్మాణం కోసం మూడేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపించారు. ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉంది. అలాగే మెంట్రాజ్పల్లి ఉన్నత పాఠశాల, సాంపల్లి ప్రాథమికోన్నత పాఠశాల, కొరట్పల్లి, రైల్వేస్టేషన్, కమలాపూర్, డిచ్పల్లిలోని ప్రాథమిక పాఠశాలల అదనపు తరగతి గదుల కోసం ప్రతిపాదనలు పంపిస్తే ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదు.
మోపాల్ మండలంలో..
మోపాల్లోని ఒడ్డెరకాలనీ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల కురిసిన వర్షానికి తరగతి గది పెచ్చులూడిపోయాయి. రెండు గదులు మాత్రమే ఉండగా, ఒక గది శిథిలావస్థకు చేరింది. పెచ్చులూడిపోయిన విషయాన్ని పాఠశాల హెచ్ఎం బద్రినాథ్ ఎంఈవో, డీఈవో, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
సిరికొండ మండలంలో..
మండలంలోని 35 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయి. 32 పాఠశాలల్లో పనులు పూర్తికాగా, మూడు పాఠశాలల్లో కొనసాగుతున్నాయి.
ధర్పల్లి, రూరల్ మండల్లాలో..
రూరల్ మండలంలోని తిర్మన్పల్లిలో ప్రాఽథమిక ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు రెండు పక్కపక్కనే ఉన్నాయి. ప్రహరీ లేక పోవడంతో పాఠశాల ఆవరణలోకి పశువులు వస్తున్నాయి. ధర్పల్లి మండలంలో అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద 25 పాఠశాలను అభివృద్ధి చేశారు.

‘రూరల్‘లో మౌలిక సౌకర్యాలు కరువు