
అరకొర వసతులు..
ఆర్మూర్ : మండల పరిషత్, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో మౌలిక వసతులు కరువయ్యాయి. ఉన్నత పాఠశాల పాఠశాలల్లో సరిపడా మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక బహిరంగ ప్రదేశాలను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. ఆర్మూర్ మండలంలో 21 ఉన్నత, 41 ప్రైమరీ పాఠశాలలున్నాయి. 50 సంవత్సరాల క్రితం నిర్మించిన కొన్ని పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయి. ఆర్మూర్ మండలం ఫతేపూర్, గోవింద్పేట్ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. డొంకేశ్వర్ మండలం నూత్పల్లిలోని బీసీ బాలుర గురుకుల పాఠశాలలో బాత్రూం తలుపులు మరమ్మతులు చేయాల్సి ఉంది. అలాగే ఈ పాఠశాలకు సంబంధించిన మరో భవనం శిథిలావస్థలో ఉంది.
శిథిలావస్థలో ఐలాపూర్ హాస్టల్ భవనం
నందిపేట మండలంలోని ఐలాపూర్లో సంక్షేమ వసతిగృహం శిథిలావస్థకు చేరుకుంది. నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.45 కోట్లు మంజూరు చేసింది. కానీ ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదు. ఓ వైపు హాస్టల్ భవనం కూలిపోయే స్థితిలో ఉండగా.. మరోవైపు వర్షా లు ప్రారంభం కావడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.