
కనిపించని తల్లి చేపలు
బాల్కొండ : తల్లిచేపలు లేకపోవడంతో ప్రతి ఏటా చేపపిల్లల ఉత్పత్తి కోసం పోచంపాడ్లోని జాతీయ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం అధికారులు నానా తంటాలు పడుతున్నారు. కానీ, స్వతహాగా తల్లి చేపల పెంపకం చేపడితే నాణ్యమైన చేపపిల్లల ఉత్పత్తికి ఢోకా ఉండదని భావించి కేంద్ర ప్రభుత్వం 2017లో తల్లి చేపల కేంద్రం నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. దక్షిణ భారతదేశంలోనే పోచంపాడ్ కేంద్రంగా రూ. 5కోట్ల నిధులతో నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కాగా, అందులో సగం వాట రారష్ట్ర ప్రభుత్వమే భరించాలని సూచించింది. దీంతో చేపపిల్లల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల నుంచే తల్లిచేపల కేంద్రానికి నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా మళ్లించింది. 2017లో పనులు ప్రారంభమైనా ఇప్పటి వరకు ఒక్క తల్లి చేపను ఉత్పత్తి చేయలేదు. తల్లి చేపల పెంపకంపై అధ్యయనం కోసం జిల్లా నుంచి మత్స్యకారులు, అధికారులు ఒడిశాకు వెళ్లి వచ్చారు. రెండేళ్ల క్రితం ఒడిశా నుంచి తల్లి చేపల పెంపకానికి నాణ్యమైన చేపలను ప్రభుత్వం సరఫరా చేసింది. కానీ, ఆ చేపలు ఎక్కడ ఉన్నాయో అధికారులకే తెలియదు. తల్లి చేపల కేంద్రంలో నీటి కొరత తీవ్రంగా ఉండటంతోనే ఆ చేపలు చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.
అందుబాటులోకి వస్తే..
తల్లి చేపల పెంపకాన్ని సరిగ్గా నిర్వహిస్తే నాణ్యమైన చేపపిల్లలను ఉత్పత్తి చేయొచ్చు. దీంతో జిల్లాలోని చెరువులకు, ప్రాజెక్టులోకి ఉచితంగా చేపపిల్లల సరఫరా చేసే అవకాశం కలుగుతుంది. కానీ, ఆ దిశగా పాలకులు, అధికారులు చర్యలు చేపట్టడం లేదు. దీంతో తల్లి చేపల కేంద్రం ముళ్ల పొదల్లో మగ్గుతోంది. తల్లిచేపల కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తే తల్లి చేపల, చేపపిల్లల టెండర్లలో కమీషన్లకు గండి పడుతుందనే ఉద్దేశంతోనే నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
ముళ్ల పొదల్లో మగ్గుతున్న కేంద్రం
ఎనిమిదేళ్లుగా ఉత్పత్తి శూన్యం
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
పోచంపాడ్లోని తల్లిచేపల కేంద్రం పనుల అసంపూర్తిపై ఉన్నతాధికారులకు నివేదించాం. త్వరలోనే సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తల్లి చేపల పెంపకం ఇక్కడే చేపడితే నాణ్యమైన చేప పిల్లలను ఉత్పత్తి చేయొచ్చు.
– దామోదర్,
మత్స్య అభివృద్ధి అధికారి, పోచంపాడ్

కనిపించని తల్లి చేపలు