
ఎస్సారెస్పీలో పెరుగుతున్న నీటిమట్టం
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి స్థానిక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వరద నీరు రావడంతో ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్లోకి 2315 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 100 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 341 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1062.60 (13.23 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు అన్నారు.
విత్తుకు జీవం పోసిన వాన
బాల్కొండ: ప్రస్తుత సంవత్సరం ముందస్తుగా మే నెలలోనే వర్షాలు కురవడంతో అన్నదాతలు ముందస్తుగానే మక్క, పసుపు పంటను విత్తారు. కానీ పది రోజుల వరకు వర్షాలు కురువక పోవడంతో విత్తనాలు మొలకెత్తక అన్నదాతలు ఆందోళన చెందారు. రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో విత్తుకు ప్రాణం పోసినట్లయిందని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పది రోజుల క్రితం విత్తిన విత్తనాలు మొలకెత్తుడకు డోఖా లేదంటున్నారు. మృగశిర కార్తే కాగానే వర్షాలు కురవడంతో విత్తనాలు పూర్తిచేయుటకు రైతులు పంటభూముల్లో బిజీగా గడుపుతున్నారు.
18లోపు ఫీజు చెల్లించండి
నిజామాబాద్ అర్బన్: జిల్లా విద్యాశాఖ పరిధిలో ట్రైనింగ్ కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులు,గతంలో ఫెయిల్ అయిన వారు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 18 లోపు రూ.150 చె ల్లించాలన్నారు. రూ.50 అపరాధ రుసుముతో ఈనెల 24 లోపు ఫీజులు చెల్లించాలన్నారు.
ఈవీఎం గోదాం పరిశీలన
కామారెడ్డి క్రైం: ఎన్నికల సంఘం ఆదేశాల మే రకు ఈవీఎం గోడౌన్కు రక్షణ చర్యలు కల్పించాలని సెక్యూరిటీ సిబ్బందిని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. మూడు నెలల సాధారణ తనిఖీల్లో భాగంగా మంగళవారం కలెక్టర్ ఈవీఎం గోడౌన్ను సందర్శించారు. గోడౌన్లో సెక్యూరిటీ కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్ను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించామన్నారు.

ఎస్సారెస్పీలో పెరుగుతున్న నీటిమట్టం