
అవే శిథిల గదులు
నిజామాబాద్అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం చేపట్టిన పనులు అసంపూర్తిగా మిగిలాయి. సుమారు 68కి పైగా పాఠశాలల్లో కొన్ని చోట్ల పనులు ఇంకా కొనసాగుతుండగా.. మరికొన్ని చోట్ల ఇంకా ప్రారంభం కాలేదు. అసౌకర్యాల మధ్యే ఈ విద్యా సంవత్సరం సైతం ప్రారంభం కానుంది. గత ప్రభుత్వం ‘మన ఊరు – మన బడి’ కార్యక్రకమం కింద పాఠశాలల అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం ‘మన ఊరు – మన బడి’ని నిలిపివేయడంతో 40 పాఠశాలల్లో పనులు అర్ధంతరంగా నిలిచిపో యాయి. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ‘అమ్మ ఆద ర్శ కమిటీలను తెరపైకి తీసుకవచ్చి పనులు చేపట్టినప్పటికీ పూర్తి చేయలేదు. 334 ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీలు, 154 బాలుర పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. 72 స్కూళ్ల భవనాల మరమ్మతులు చేయాల్సి ఉంది. ఇందులో కొన్నింటిని అమ్మ ఆద ర్శ పాఠశాల కింద ఎంపిక చేసి మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించినప్పటికీ పనులు ప్రారంభం కా లేదు. 57 పాఠశాలలకు అదనపు గదులు అవసరం ఉంది. 23 పాఠశాలల భ వనాలకు తక్షణమే మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. 346 పాఠశాలలకు ఫర్నిచర్ కొరత ఉంది.
అరకొర వసతుల మధ్యే ఈ ఏడాది సైతం పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. పాఠశాలల నిర్వహణ, మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వాలు ఎన్నికార్యక్రమాలు చేపడుతున్నా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. నిధుల కొరత కారణంగా వేసవి సెలవుల్లో పనులు పూర్తి కాలేదు. జిల్లాలో 1156 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. ఇందులో అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 760 స్కూళ్లను ఎంపిక చేశారు. రూ.42 కోట్ల 38 లక్షలు నిధులు మంజూరు చేయాల్సి ఉండగా.. రూ.21 కోట్ల 32 లక్షలు మాత్రమే మంజూరు చేశారు.
సమస్యల వలయంలో
ప్రభుత్వ పాఠశాలలు
68 స్కూళ్లలో పూర్తికాని పనులు
నిధులు లేక ముందుకు సాగని పరిస్థితి
రేపటి నుంచి పున:ప్రారంభం
పనులు కొనసాగుతున్నాయి
జిల్లాలో గుర్తించి ప్రభుత్వ బడుల్లో కొన్ని చోట్ల పనులు కొనసాగుతున్నయి. మరికొన్ని ఆలస్యంగా ప్రారంభం కావడంతో పనులు పూర్తి కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ విద్యార్థులకు ఇబ్బందులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.
– అశోక్, జిల్లా విద్యాశాఖాధికారి
పట్టని సంక్షేమం
జిల్లాలో 42 ఎస్సీ, 33 బీసీ, 8 ఎస్టీ వసతిగృహాలున్నాయి. 18 ఎస్సీ వసతి గృహాల్లో మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. వేసవి సెలవులకు ముందే వసతిగృహల్లో మరమ్మతులు చేపట్టాల్సి ఉండగా నిధులు లేకపోవడంతో పనులను ప్రారంభించలేదు. ఎస్టిమేషన్ నివేదికలు రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించి వేచి చూస్తున్నారు. అలాగే బీసీ, ఎస్టీ వసతిగృహాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రంలోని బీసీ వసతిగృహం పెచ్చులూ డి విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది.