18 పాఠశాలలకు, కళాశాలలకు చేరిన వస్త్రం ఎస్హెచ్జీలకు కుట్టు బాధ్యత త్వరలో అందజేస్తామంటున్న అధికారులు
లక్ష్మణచాంద:రాష్ట్ర ప్రభుత్వం బాలికల విద్యను బలోపేతం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. మధ్యలో చదువు మానేసిన పేద, మధ్యతరగతి బాలికలను మళ్లీ చదువుబాట పట్టించి, ఇంటిని మరచిపోయేలా ఆకర్షణీయమైన భోజనం, వసతితో కూడిన నాణ్యమైన విద్య అందించి ఉత్తమ విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి కేజీబీవీలను ప్రారంభించింది.
ఏకరూప దుస్తుల ఆలస్యం..
నూతన విద్యా సంవత్సరం ప్రారంభం రోజే ఏకరూప దుస్తులు అందించాల్సి ఉంది. సకాలంలో వస్త్రం అందకపోవడంతో విద్యార్థినులు పాత దుస్తులతోనే తరగతులకు హాజరవుతున్నారు. ఈ ఏడాది 6వ తరగతిలో చేరిన బాలికలు యూనిఫామ్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేజీబీవీ బాలికలకు ఏకరూప దుస్తులు అందించేందుకు వస్త్రం జిల్లా కేంద్రానికి చేరింది. అధికారులు ఈ వస్త్రాన్ని జిల్లాలోని ఎస్హెచ్జీలకు అందజేసి త్వరగా కుట్టాలని సూచించారు.
జిల్లాలో విద్యార్థినుల వివరాలు..
జిల్లాలో మొత్తం 18 కేజీబీవీ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 6 నుంచి 10వ తరగతి వరకు 4,883 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే కేజీబీవీ ఇంటర్ కళాశాలలో మొదటి, రెండో సంవత్సరాల్లో 2,315 మంది విద్యార్థినులు చదువుతున్నారు. 18 కేజీబీవీలకు చెందిన బాలికల యూనిఫాం కోసం టా ప్లకు 15,400 మీటర్లు, బాటమ్కు 24,900 మీటర్లు, సూట్లకు 16,200 మీటర్ల వస్త్రం చేరిందని జీసీడీవో రమాదేవి తెలిపారు. ఇప్పటికే ఎస్హెచ్జీలకు అందజేసి కుట్టడం ప్రారంభమైంది. త్వరలో కుట్టడం పూర్తి చేసి బాలికలకు అందజేయడానికి చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు.
జిల్లాకు చేరిన మొత్తం వస్త్రం 56,500 మీటర్లు
మొత్తం పాఠశాలలు 18
త్వరలో అందిస్తాం..
కేజీబీవీలలోని బాలికలకు ప్రభుత్వం సరఫరా చేసిన ఏకరూప దుస్తుల వస్త్రం ఎస్హెచ్జీలకు అందించాం. వారు కుట్టడం ప్రారంభించారు. వేగవంతంగా స్టిచ్చింగ్ చేయించి బాలికలకు వీలైనంత త్వరగా అందించేలా చర్యలు తీసుకుంటాం. – రమాదేవి, జీసీడీవో
పాఠశాల విద్యార్థులు 4,883
కళాశాలల విద్యార్థులు 2,315


