ఖానాపూర్: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యంలో నుంచి అక్రమంగా కోతలు విధింయడంతోపాటు ధాన్యం డబ్బులు చెల్లించడంలో జాప్యంపై రైతుల ఆందోళన చేపట్టారు. మండలంలోని మస్కాపూర్ గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో దోపిడీని నిరసిస్తూ గ్రామంలోని రైతులు నిర్మల్–ఖానాపూర్ ప్రధాన రహదారిపై ఉదయం నుంచి మద్యాహ్నం వరకు రాస్తారోకో చేశారు. కేంద్రం నిర్వాహకులతోపాటు ఉన్నతాధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూకం, డబ్బుల చెల్లింపులో రైతులు నష్టపోతున్నారన్నారు. హమాలీ, లారీల్లో లోడింగ్, అన్లోడింగ్ పేరుతో ఇష్టారాజ్యంగా అదనపు వసూల్లు చేశారని తెలిపారు. దీంతో క్వింటాల్కు రూ.45 అదనపు నష్టం జరిగిందన్నారు. 40 కిలోల బస్తాకు 43 కిలోల 400 గ్రాముల చొప్పున తూకం వేసినప్పటికీ బిల్లులు ఇచ్చే క్రమంలో 38 కిలోల చొప్పున లెక్కిస్తున్నారని ఆరోపించారు. క్వింటాల్కు 10 కిలోలు కోత విధిస్తున్నారని తెలిపారు. రైతులకు పూర్తిస్థాయి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో ట్రాఫిక్ నిలిచిపోయింది. కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తహసీల్దార్ సుజాత అక్కడి చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం జిల్లా కేంద్రానికి వాహనాల్లో వెళ్లి కలెక్టర్ భవేశ్మిశ్రా, అదనపు కలెక్టర్ కిశోర్కుమార్కు వినతి పత్రాలు ఇచ్చారు.


