నిర్మల్ రూరల్: బడిగంట మోగింది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సోమవారం పునఃప్రారంభమయ్యాయి. తొలిరోజు అమావాస్య కావడంతో ఎక్కువ మంది విద్యార్థులు బడులకు రాలేదు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు అందజేశారు. అమావాస్య కారణంగా కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఈనెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మామిడి తోరణాలు కట్టి, విద్యార్థులక పూల బొకేలు అందించి ఆహ్వానించారు. విద్యార్థులు ఉత్సాహంగా బడులకు హాజరయ్యారు.
అమావాస్య సెంటిమెంట్...
సోమవారం అమావాస్య కావడంతో పలు ప్రభు త్వ, ప్రైవేటు పాఠశాలల్లో హాజరు శాతం బాగా తగ్గింది. జిల్లావ్యాప్తంగా కేవలం 30 శాతం మంది విద్యార్థులు మాత్రమే హాజరైనట్లు విద్యాశాఖ అధి కారులు వెల్లడించారు. మంగళవారం కూడా అంతంత మాత్రంగానే విద్యార్థులు వస్తారని, బుధవా రం నుంచి హాజరు పెరుగుతుందని అధికారులు తెలిపారు. తొలిరోజు డీఈవో భోజన్న, అధికారులు నిర్మల్ మండలం రత్నాపూర్ కాండ్లీ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించారు. విద్యార్థుల కు పువ్వులు అందించి ఆహ్వానించారు. అనంతరం వారికి పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు అందజేసి బాగా చదువుకోవాలని సూచించారు. పాఠశాలకు, జిల్లాకు పేరు తేవాలన్నారు. బడిబాటలో విద్యార్థుల సంఖ్య పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. సర్కార్ బడుల్లో విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు ప్రభుత్వ బడుల్లోనే తమ పిల్లలను చేర్పించాలని కోరారు.


