
అర్చకులకు శుభవార్త
● బీమా, రిటైర్మెంట్ ప్రయోజనాలు ● జిల్లాలో 273 మందికి లబ్ధి
లక్ష్మణచాంద: రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల్లో సేవలందిస్తున్న అర్చకులు, ధూప దీప నైవేద్యం (డీడీఎన్) అర్చకులకు బీమా, రిటైర్మెంట్ ప్ర యోజనాలతో కూడిన కొత్త విధానాలను ప్రకటించింది. ఈ నిర్ణయం జిల్లా వ్యాప్తంగా అర్చకు లలో సంతోషాన్ని నింపింది. దీర్ఘకాలంగా ఆలయాల్లో సేవ చేస్తున్న వారి ఆర్థిక భద్రతను బలో పేతం చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆర్థిక సాయం పెంపు
2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ద్వారా ప్రారంభమైన ధూప దీప నైవేద్యం(డీడీఎన్) పథకం, అర్చకులకు ఆర్థిక సాయం అందించేందుకు రూపొందించబడింది. ప్రారంభంలో నెలకు రూ.2,500గా ఉన్న సహాయం, 2015లో రూ.6 వేలకు(పూజా ద్రవ్యాలకు రూ.2 వేలు, అర్చకుడికి రూ.4 వేలు) అందించారు. 2023లో రూ.10 వేలు(పూజా ద్రవ్యాలకు రూ.4 వేలు, అర్చకుడికి రూ.6 వేలు) పెరిగింది. ఈ పెంపు అర్చకుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించింది.
జిల్లాలో 273 మందికి లబ్ధి..
జిల్లాలో డీడీఎన్ పథకం కింద 273 ఆలయాలు ఉ న్నాయి. వీటిలో ఎ కేటగిరీలో 2, బి కేటగిరీలో 4, సి కేటగిరీలో 1 ఆలయం ఉన్నాయి. ఈ పథకం ద్వారా అర్చకులకు నిరంతర సహాయం అందుతోంది, అయితే కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి.
వేతనాలు ఆలస్యం
జిల్లాలో డీడీఎన్ పథకం కింద సేవలందిస్తున్న అర్చకులు గత మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబ పోషణ కష్టమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను తక్షణం పరిష్కరించి, బకాయిలను విడుదల చేయాలని అర్చకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ప్రయోజనాలు ఇలా..
ప్రభుత్వం అర్చకులకు అందించే ప్రయోజనాలు విభిన్న రకాలుగా రూపొందించబడ్డాయి.
రిటైర్మెంట్ గ్రాట్యూటీ:
రెగ్యులర్ అర్చకులు: 20 ఏళ్లకుపైగా సేవలకు రూ.8 లక్షలు, 15–20 ఏళ్ల సేవలకు రూ.6 లక్షలు, 10–15 ఏళ్ల సేవలకు రూ.4 లక్షలు, 10 ఏళ్లలోపు మరణిస్తే రూ.2 లక్షలు.
డీడీఎన్ అర్చకులు: 20 ఏళ్లకు పైగా సేవలకు రూ.4 లక్షలు, 15–20 ఏళ్ల సేవలకు రూ.3 లక్షలు, 10–15 ఏళ్ల సేవలకు రూ.2 లక్షలు.
మరణానంతర సహాయం: అర్చకులకు ఎక్స్–గ్రేషియాగా రూ.50 వేలు, అంతిమ సంస్కారాలకు రూ.30 వేలు.
ఉపనయనం గ్రాంట్: రూ.50 వేలు
ఇంటి నిర్మాణం: డీడీఎన్ అర్చకులకు రూ.50 వేలు, రెగ్యులర్ అర్చకులకు రూ.4 లక్షల రుణ సహాయం.
విద్యా పథకం: గ్రాడ్యుయేషన్, పీజీ, పీహెచ్డీ కోర్సులకు ఏటా రూ.35 వేలు రీయింబర్స్మెంట్.
మెడికల్ సహాయం: మెడికల్ బోర్డు సిఫారసుతో గరిష్టంగా రూ.2 లక్షలు.
వివాహ పథకం: రెగ్యులర్ అర్చకులకు రూ.2 లక్షల రుణం, డీడీఎన్ అర్చకులకు రూ.1,01,116, మహిళా అర్చకులు/వారి కుమార్తెల వివాహానికి రూ.1,25,000.