
సర్వే నంబర్ 241..!
● ఉన్నది 40 ఎకరాలు.. 77 ఎకరాలకు పట్టాలు! ● యాకర్పెల్లిలో భూ వివాదం ● అధికారుల తప్పిదంతో రైతులకు శిక్ష ● ఏళ్లుగా భూముల కోసం గొడవలు..
కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వే..
ఇటీవల కలెక్టర్ ఆదేశించిన విధంగా సర్వేయర్లతో టీం ఏర్పాటు చేసి భూమి కొలతలు చేయిస్తాం. అలాగే మోఖాపై(సాగుచేసుకుంటున్న) రైతులు ఎవరు, సాగు చేయకుండా పట్టాలు పొందిన వారు ఎవరు అనే విషయాలను పరిశీలిస్తాం. దాని ఆధారంగా గ్రామంలో గ్రామ సభ నిర్వహించి రైతుల అభిప్రాయాలను సేకరిస్తాం. అనంతరం ఒరిజినల్ పట్టాదారులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటాం.
– శ్రీదేవి, తహసీల్దార్, సారంగాపూర్
రెవెన్యూ వ్యవస్థలో లోపాలు
241 సర్వే నంబర్లోని భూ వివాదం రెవెన్యూ వ్యవస్థలోని పారదర్శకత, కచ్చితత్వం లోపాలను స్పష్టం చేస్తుంది. గతంలో అధికారుల నిర్లక్ష్యం, రికార్డుల నిర్వహణలో తప్పిదాలు ఈ సమస్యకు దారితీశాయి. ఆన్లైన్ రెవెన్యూ రికార్డులు వాస్తవ భూ విస్తీర్ణంతో సరిపోలకపోవడం, అసైన్డ్ భూముల జారీలో అస్పష్టత వంటివి రైతులకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ సమస్య రైతు భరోసా, పీఎం కిసాన్ వంటి పథకాల అమలును కూడా అడ్డుకుంటోంది. రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, క్షేత్రస్థాయి సర్వేలు, కఠినమైన పర్యవేక్షణ ద్వారా ఇటువంటి సమస్యలను నివారించవచ్చు.
సారంగపూర్: మండలంలోని యాకర్పెల్లి గ్రామ శివారులో సర్వే నంబర్ 241లోని అసైన్డ్ భూమి వివాదాల కేంద్రంగా మారింది. ఈ సర్వే నంబర్లో ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. 40.46 ఎకరాల భూమి ఉంది. ఈమేరకే రైతులకు పట్టాలు ఉండాలి. కానీ, భూమికి మించి అధికంగా పట్టాలు జారీ కావడంతో రైతులు, అన్నదమ్ములు, క్రయవిక్రయదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయంలో ఈ సర్వే నంబర్కు సంబంధించిన ఫిర్యాదులు సర్వసాధారణమయ్యాయి. అధికారులు ‘‘241 సర్వే నెంబరా?’’ అని ఎదురు ప్రశ్న వేస్తూ కామన్ అన్నట్లు చూస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే భూ సమస్యకు కారణమని రైతులు ఆరోపిస్తున్నారు.
ఇష్టారాజ్యంగా పట్టాలు..
241 సర్వే నంబర్లో వాస్తవంగా 40.36 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, గతంలో 32 మంది భూమిలేని రైతులకు అసైన్డ్ పట్టాలు జారీ చేశారు. అయితే, ప్రస్తుతం ఈ సర్వే నంబర్లో మరో 50 మందికి పైగా పట్టాలు జారీ అయ్యాయి. ఆన్లైన్ రెవెన్యూ రికార్డులలో ఈ భూమి విస్తీర్ణం 77.17 ఎకరాలుగా నమోదైంది, అంటే 36 ఎకరాల 21 గుంటలు అధికంగా నమోదు చేశారు. అక్రమ పట్టాలతో రెవెన్యూ సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్) సమస్య ఉత్పన్నమై, రైతులు రైతు భరోసా, పీఎం కిసాన్ వంటి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను కోల్పోతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం..
ఈ సమస్యకు మూల కారణం గతంలో పనిచేసిన వీఆర్వోలు. డబ్బులు తీసుకుని ఇష్టారీతిన పట్టాలు జారీ చేశారని రైతులు భూమిని విక్రయించినప్పుడు కొనుగోలుదారుల పేరిట కొత్త పట్టాలు జారీ చేసినా, విక్రయించిన రైతుల పేర్లు రికార్డుల నుంచి తొలగించకపోవడం ఒక సమస్య. అలాగే, మరణించిన రైతుల పట్టాలను వారసుల పేరిట మార్పు చేసినప్పుడు పాత రికార్డులను తొలగించకపోవడంతో భూమి విస్తీర్ణం అధికంగా నమోదైంది. ఈ నిర్లక్ష్యం ఫలితంగా 241 సర్వే నంబర్లో నిత్యం పంచాయితీలు, గొడవలు జరుగుతున్నాయి.
పరిష్కారం దిశగా అడుగులు
కలెక్టర్ అభిలాష అభినవ్ ఇటీవల భూభారతి రెవె న్యూ సదస్సులో యాకర్పెల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సమయంలో రైతులు ఈ సమస్యను వివరించారు. సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్న కలెక్టర్, తహసీల్దార్ శ్రీదేవి నేతృత్వంలో సర్వేయర్లతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కమి టీ భూమి కొలతలు తీసి, వాస్తవంగా సాగు చేస్తు న్న రైతులకు మాత్రమే పట్టాలు జారీ చేయాలని సూచించారు. సాగులో లేనివారి పేర్లు తొలగించా లని పేర్కొన్నారు. రైతులు ఈ ప్రతిపాదనకు సమ్మ తి తెలుపడంతో, రెవెన్యూ సదస్సు తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని కలెక్టర్ హామీ ఇచ్చారు.

సర్వే నంబర్ 241..!