ఎంత ఘోరం.. కొడుకుని కాలువలో పడేసిన తల్లి.. మొసళ్లు కొరకడంతో | Woman Throws Son 6 Into Crocodile-Infested River Body Found Day Later | Sakshi
Sakshi News home page

ఎంత ఘోరం.. కొడుకుని కాలువలో పడేసిన తల్లి.. మొసళ్లు కొరకడంతో

May 6 2024 2:43 PM | Updated on May 6 2024 3:22 PM

Woman Throws Son 6 Into Crocodile-Infested River Body Found Day Later

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో అమానుష​ ఘటన వెలుగుచూసింది. భార్యభర్తల గొడవ ఆరేళ్ల బాలుడి ప్రాణాలు తీసింది. దంపతుల మధ్య వివాదం కారణంగా ఆరేళ్ల మూగవాడైన కొడుకును కాలువలో పడేయడంతో అందులోని మొసళ్లు బాలుడిని కొరికి చంపేశాయి.. వివరాలు.. ఉత్తర కన్నడ జిల్లా, దండెలి తాలూకాలో నివసించే సావిత్రి అనే 33 ఏళ్ల మహిళ సావిత్రికి, భర్త రవికుమార్‌, కుమారులు వినోద్‌(6)‌, రెండేళ్ల బాలుడు ఉన్నారు. సావిత్రి ఇంట్లో పనులు చేస్తూ జీవిస్తుండగా రవి తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు.

కాగా పెద్ద కొడుక్కి చెవులు వినబడకపోవడం, మాటలు రాకపోవడంతో అతడి విషయంలో గత కొంతకాలంగా దంపతుల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. గత శనివారం వీరిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో ఆవేశంతో సావిత్రి తన కొడుకుని ఉత్తర కన్నడ జిల్లాలోని ఓ కాలువలో పడేసింది. అయితే ఆ కాలువలో మూసళ్లు ఉండటంతో బాలుడిని దారుణంగా కొరికి చంపేశాయి.

దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. అదే రోజు రాత్రి కాలువలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. మరుసటి రోజు ఉదయం బాలుడి మృతదేహం లభ్యమైంది. మృతదేహం అంతా కొరికిన గుర్తులు ఉండగా, బాలుడి కుడి చేయి కూడా కనిపించలేదు. దీంతో చిన్నారిని మొసళ్లు కొరికి చంపేసి ఉంటాయని పోలీసులు నిర్ధారించారు. తల్లిదండ్రులు రవి, సావిత్రి ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

అయితే తన కొడుక్కి చావుకు భర్తే బాధ్యుడని సావిత్రి పేర్కొంది. మూగ కుమారుడిని ఎందుకు కన్నావ్‌ అంటూ రవి తనతో పదే పదే గొడవపడేవాడని సావిత్రి తెలిపింది. తినడం తప్ప ఏం చేతగాని కొడుకును కాల్వలో పడేసి చంపేస్తానని బెదిరించేవాడని చెప్పింది. ‘నా భర్త అలా మాట్లాడుతుంటే, కొడుకు మాత్రం ఎంత టార్చర్ భరించగలడు. నా బాధను ఎవరితో చెప్పుకోగలను’ అని పేర్కొంది. చివరికి ఇద్దరిని అరెస్ట్‌ చేసిన పోలీసులు వారిపై హత్యకేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement