
హమీర్పూర్: హిమాచల్ ప్రదేశ్లోని సంజౌలీలో అక్రమంగా నిర్మిస్తున్న మసీదును కూల్చివేయాలని కోరుతూ దేవభూమి సంఘర్ష్ సమితి హమీర్పూర్లో నిరసన ర్యాలీ చేపట్టింది. దీనిలో పాల్గొన్న 46 ఏళ్ల విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) సభ్యుడొకరు గుండెపోటుతో కన్నుమూశారు. వక్ఫ్ బోర్డును రద్దు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
దేవభూమి సంఘర్ష్ సమితి పిలుపు మేరకు సిమ్లా, హమీర్పూర్, మండీ, చంబా, నహాన్ జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. హమీర్పూర్లో ఆందోళనకారులు అధికారులకు మెమోరాండం సమర్పించడానికి వెళ్తుండగా, వీహెచ్పీ కార్యకర్త వరిందర్ పర్మార్ స్పృహతప్పి పడిపోయాడు. అతన్ని వెంటనే పోలీసు వాహనంలో హమీర్పూర్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు అతను మృతిచెందాడని తెలిపారు.
నిరసన ప్రదర్శనలో పాల్గొన్న దేవభూమి సంఘర్ష్ సమితి కమిటీ కో-కన్వీనర్ మదన్ ఠాకూర్ మాట్లాడుతూ, వివాదాస్పద మసీదుపై అక్టోబర్ ఐదు వరకూ కోర్టు నిర్ణయం కోసం వేచి చూస్తామని, ఆ తరువాత భవిష్యత్ వ్యూహాన్ని నిర్ణయించుకుంటామన్నారు. అక్టోబర్ ఐదు తర్వాత జైల్ భరో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. తమపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, ప్రజల మనోభావాలను రెచ్చగొట్టిన ఏఐఎంఐఎం నేత షోయబ్ జమైపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు.
ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదం.. తొమ్మిదిమంది మృతి