ధర్మశాల: హిమాచల్ ప్రదేశ్ను భీకరమైన ఎండలు వెంటాడుతున్నాయి. ఈ వేడి వాతావరణం కారణంగా రాష్ట్రంలోని సోలన్, కసౌలి ప్రాంతాల్లోని అడవులు, పండ్ల తోటలు భారీ అగ్నిప్రమాదానికి గురయ్యాయి. మంటల తీవ్రతకు పచ్చని అడవులు కాలి బూడిదవుతుండగా, నివాస ప్రాంతాలకు చేరువలో పొగలు దట్టంగా కమ్ముకుంటున్నాయి.
సహాయక చర్యల్లో వాయుసేన
అడవుల్లో మంటలు వేగంగా వ్యాపిస్తుండటంతో, భూమార్గంలో చేరుకోవడం అసాధ్యమైన ప్రాంతాల్లో మంటలను ఆర్పేందుకు భారత వాయుసేన (ఐఏఎప్)రంగంలోకి దిగింది. మంగళవారం నుండి చేపట్టిన ఈ ఆపరేషన్లో భాగంగా ఎంఐ-17, చినూక్ హెలికాప్టర్లను ప్రభుత్వం రంగంలోకి దించింది. చండీగఢ్లోని సుఖ్నా సరస్సు నుండి నీటిని తీసుకువచ్చి, ఆకాశం నుండి మంటలపై చిమ్ముతూ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
VIDEO | Himachal Pradesh: Efforts continue to douse forest fire that broke out in Kasauli. On Tuesday, at least two Indian Air Force helicopters were deployed to douse the blaze.#HimachalPradeshNews
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/KmqxFNEgJm— Press Trust of India (@PTI_News) May 27, 2026
భీతిగొల్పుతున్న దృశ్యాలు
కసౌలి, కందఘాట్ సమీపంలోని క్యారీఘాట్ గ్రామాల్లోని అడవుల్లో మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. హిమాలయ ఓక్ చెట్లు, పండ్ల తోటలు మంటల్లో చిక్కుకుని భారీగా నష్టపోతున్నాయి. పచ్చని కొండల గుండా నిప్పులు వెదజల్లుతున్న దృశ్యాలు అగ్నిప్రమాద తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది, వాయుసేన బృందాలు సంయుక్తంగా మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. తీవ్రమైన వేడిగాలులు మంటలు మరింత విస్తరించడానికి కారణమవుతున్నాయి. అధికారులు నిరంతరం అడవులను పర్యవేక్షిస్తూ, మంటలు మరింతగా పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


