ముంబై: మహారాష్ట్రలో బీభత్సం సృష్టించి నలుగురు మహిళల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న పులిని ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు బంధించారు. ఈ రోజు( ఆదివారం) పులిని బంధించడానికి అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో పులి చిక్కినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా రెండురోజుల క్రితం చంద్రపూర్ జిల్లా గంజేవాహి అడవీ ప్రాంతంలో ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో మహిళలు బీడీ ఆకులు ఏరుకోవడానికి అడవికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడే మాటు వేసిన పులి విచక్షణ రహితంగా వారిపై దాడి చేసింది. మెుత్తంగా 13 మందిపై బెబ్బులి దాడి చేయగా అందులో నలుగురు మృతిచెందారు.
మృతిచెందిన వారు దాదాజి మెహర్లే, సంగీతా సంతోష్ చౌదరీ, కౌశిక్ మెుహర్లే, అనుబాయి దాదాజీ మెుహర్లేగా గుర్తించారు. దీంతో వివరాలు తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. పులిని బంధించడానికి అధికారులు ప్రయత్నాలు చేయగా ఎట్టకేలకు బోనులో చిక్కింది.


