కేరళ తరహా మరో నరబలి కలకలం.. మూడు రోజులుగా తాంత్రిక పూజలు చేస్తూ..

Tamil Nadu Police Thwart Human Sacrifice Ritual In Tiruvannamalai - Sakshi

కేరళ నరబలి ఉదంతం.. దేశం మొత్తాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ఆర్థికంగా చితికిపోయిన ఓ జంట మరో వ్యక్తి సహకారంతో.. డబ్బు దొరుకుతుందనే ఆశతో ఇద్దరి మహిళలను బలి ఇచ్చారు. తొలుత బాధిత మహిళలు రెస్లీ, పద్మను నరబలి ఇచ్చి.. వాళ్లను ముక్కలుగా నరికి కాల్చేశారు. ఈ ఘటన మరిన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. 

ఇలాంటి తరుణంలోనే తమిళనాడులో మరో ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఓ ఇంట్లోని పూజ గదిలో కూర్చుని క్షుద్రపూజలు చేస్తున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం.. తిరువణ్ణామలై జిల్లా ఆరణి సమీపం ఎస్బీ నగర్‌లోని ఓ ఇంటిలోని వ్యక్తులు మూడు రోజులుగా బయటకు రాలేదు. దీంతో, వారింట్లో నరబలి పూజలు జరుగుతున్నాయని స్థానికంగా వార్తలు, పుకార్లు బయటకు వచ్చాయి. స్థానికుల అనుమానాలను బలపరుస్తూ.. ఇంటి లోపలి నుంచి తాంత్రిక పూజలు జరుగుతున్న అలికిడి వినిపించడం అక్కడున్న వారిని భయాందోళనకు గురిచేసింది. దీంతో, ఈ విషయాన్ని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.    

వారి సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి తలుపులు తీయాలని పోలీసులు ఇంట్లో ఉన్న వారిని కోరారు. అయినప్పటికీ వారు తలుపులు తీయలేదు. ఈ సందర్భంగా ఇంట్లో ఉన్న వారు పూజలు చేస్తున్న శబ్ధాలు, గంటల చప్పుడు వినిపించింది. దీంతో, పోలీసులు.. బుల్డోజర్‌ సాయంతో ఇంటి ముందు భాగాన్ని కూల్చివేయాలని అ‍గ్నిమాపకశాఖ సిబ్బందిని ఆదేశించారు. ఇలా కూల్చివేసిన అనంతరం.. పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా.. పూజగదిలో ఆరుగురు కూర్చుని తాంత్రిక పూజలు జరుపుతూ కనిపించారు. దీంతో, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, పూజలపై వారిని ప్రశ్నించగా వారింట్లో ఒకరికి దెయ్యం పట్టిందని సమాధానం ఇవ్వడం గమనార్హం. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top