15 ఏళ్ల టీనేజర్ అవాంఛిత గర్భంపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ
గర్భవిచ్ఛిత్తికి అనుమతి మంజూరు
న్యూఢిల్లీ: ఇష్టంలేకుండా మహిళను మరీముఖ్యంగా మైనర్ బాలికను అవాంఛిత గర్భం కొనసాగించాలని ఏ న్యాయస్థానమూ ఆదేశించజాలదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఏడునెలల తన అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేందుకు 15 ఏళ్ల బాలికకు అనుమతినిస్తూ శుక్రవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ‘‘జన్మనివ్వాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే హక్కు పుట్టబోయే బిడ్డ కంటే గర్భంతో ఉన్న మహిళకే ఎక్కువ ఉంటుంది.
ఒకవేళ ఇష్టంలేని గర్భం కొనసాగిస్తే దీర్ఘకాలంలో ఆ టీనేజర్ మానసిక ఆరోగ్యం, విద్యావకాశాలు, సామాజిక స్థితిగతులు మొత్తంగా ఆమె అభివృద్ధి మీద దుష్ప్రభావం పడే ఆస్కారముంది. ఒకరికి ఆమె జన్మనివ్వాలా వద్దా అనే స్వయంనిర్ణాయాధికారానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి. అవాంఛిత గర్భాన్ని నువ్వు కొనసాగించాల్సిందేనని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా మనం ఆదేశిస్తే అది ఆమెకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది’’అని కోర్టు వ్యాఖ్యానించింది.


