ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యులు రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ ఆప్కు రాజీనామా చేశారు. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు మరో నలుగురు పంజాబ్ ఆప్ ఎంపీలు కూడా రాజీనామాకు సిద్ధమయ్యారు.
ఆపరేషన్ కమలం కలకలం
పంజాబ్లో ఆపరేషన్ కమలం కలకలం రేపుతోంది. మొత్తం ఏడుగురు ఎంపీలు రాజీనామా చేశారు. పంజాబ్ నుంచి ఉన్న ఆప్ రాజ్యసభ సభ్యుల్లో అశోక్ కుమార్ మిట్టల్, హర్భజన్ సింగ్ (క్రికెటర్), రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, రాజిందర్ గుప్తా, బల్బీర్ సింగ్ సీచేవాల్, విక్రమ్జీత్ సింగ్ సహ్నేలు ఉండగా వీరంతా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరబోతున్నారు.
కేంద్ర కేబినెట్లోకి రాఘవ్ చద్దా
ఈ మేరకు ఎంపీ రాఘవ్ చద్దా శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు అవినీతిపై పోరాటం చేస్తామని హామీ ఇచ్చి ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ నిజాయితీ రాజకీయాలకు దూరమైంది. ‘నేను నా జీవితంలోని 15 ఏళ్లను అంకితం చేసిన ఆప్ ఇప్పుడు నిజాయితీ రాజకీయాలకు దూరమైంది. నేను తప్పుడు పార్టీలో ఉన్న సరైన వ్యక్తిని. నేను పార్టీకి దూరమై ప్రజలకు దగ్గరవుతున్నాను. నాతో పాటు మొత్తం రాజ్యసభలో ఆప్కు చెందిన 10 మంది ఎంపీలలో దాదాపు మూడింట రెండు వంతుల మంది (ఆంటే ఆరు నుంచి ఏడుగురు ఎంపీలు) బీజేపీలో చేరుతున్నారు’అని ప్రకటించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కేంద్ర కేబినెట్లోకి రాఘవ్ చద్దాకు చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది.
కేజ్రీవాల్కు నమ్మిన బంటు
అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుకొచ్చింది.2011లో అర్వింద్ కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్తో పాటు పలువురు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ మరుసటి ఏడాది అంటే 2012లో ఆమ్ ఆద్మీ పార్టీని నెలకొల్పారు. అప్పుడే రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆప్లో చేరారు. నాటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీలో జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్కు నమ్మిన బంటుగా, అనుచరుడిగా కొనసాగారు.
కాగా, ఇప్పటివరకూ ఆమ్ ఆద్మీకి రాజ్యసభలో 10 ఎంపీ బలం ఉండగా, పంజాబ్ నుంచి ఏడుగురు, ఢిల్లీ నుంచి ముగ్గురు ఉన్నారు. తాజా రాజీనామాల ఎపిసోడ్తో ఆప్ రాజ్యసభ సభ్యుల సంఖ్య సింగిల్ డిజిట్కి వచ్చేసింది.


