ఆర్భాటాలకు పోకండి.. వివాహాలు సాదాసీదాగానే జరిపించండి | Pune Vaishnavi Case: Maratha Community Push For Modest Weddings | Sakshi
Sakshi News home page

ఆర్భాటాలకు పోకండి.. వివాహాలు సాదాసీదాగానే జరిపించండి

May 27 2025 1:02 PM | Updated on May 27 2025 1:36 PM

Pune Vaishnavi Case: Maratha Community Push For Modest Weddings

ఆర్థిక స్తోమత లేకున్నా.. అప్పులు చేసి మరీ పిల్లల వివాహాలను ఘనంగా నిర్వహించే తల్లిదండ్రులను చూస్తున్నాం. అయినా కూడా గొంతెమ్మ కోరికలతో అత్తింటి వాళ్లను ఇబ్బంది పెట్టే అల్లుళ్లను.. ఆ వేధింపులను మౌనంగా భరించే కూతుళ్లను చూస్తున్నాం. మహారాష్ట్రలో ఇలాంటి వేధింపుల ఉదంతం.. సంచలన కేసు.. అక్కడి మరాఠా పెద్దలను చలించిపోయేలా చేసింది. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది.  

మహారాష్ట్ర మరాఠా కమ్యూనిటీ (Maratha Community) సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వివాహాల విషయంలో ఆర్భాటాలు వద్దని, వీలైనంత వరకు సాదాసీదాగానే జరిపించాలని ఒక తీర్మానం చేసింది. ఎన్సీపీ బహిష్కృత నేత రాజేంద్ర హగవానే చిన్న కోడలు వైష్ణవి అదనపు కట్నం వేధింపులకు బలైంది. ఈ ఘటన నేపథ్యంతో సోమవారం మరాఠా కమ్యూనిటీ ఉన్నత కుటుంబాలకు చెందిన కొందరు పెద్దలు, రాజకీయ నాయకులు  సమావేశమై పై నిర్ణయం తీసుకున్నారు.

వైష్ణవి(Vaishnavi)  తల్లిదండ్రులు ఎన్సీపీ నేతలు. అదే పార్టీకి చెందిన నేత రాజేంద్ర హగవానే చిన్నకొడుక్కి 2023లో వైష్ణవిని ఇచ్చి వివాహం జరిపించారు. కోరినంత కట్నం ఇచ్చి అంగరంగ వైభవంగా జరిపించినా.. ఫలితం లేకుండా పోయింది. మరో 2 కోట్ల రూపాయల అదనపు కట్నం తేవాలంటూ అత్తింటివాళ్లు ఆమెను వేధించారు. ఈ క్రమంలో నదిలో దూకి ఒకసారి, ఎలుకల మందు తిని మరోసారి ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది.

ఇరు కుటుంబాలు రాజకీయాల్లో ఉండడంతో.. మరాఠా పెద్దలు విషయాన్ని పెద్దది కానివ్వకుండా పంచాయితీ పెట్టి సమస్యను పరిష్కరించామనుకున్నారు. కానీ ఓ బిడ్డ పుట్టాక కూడా ఆ వేధింపులు అలాగే కొనసాగాయి. ఈ క్రమంలో.. ఆ వేధింపులు తాళలేక ఆమె పుణే పింప్రి-చించ్వాద్‌లోని పుట్టింటికి చేరింది.ఈ నెల 16వ తేదీన ఇంట్లో ఎవరూలేని టైంలో ఆమె ఉరేసుకుని ప్రాణం తీసుకుంది. నాటకీయ పరిణామాల నడుమ.. రాజేంద్ర హగావానే, అతని కోడుకు అరెస్ట్‌ కావడం, వైష్ణవి 10 నెలల కొడుకు ఆమె తల్లిదండ్రుల చెంతకు చేరడం పలువురిని కంటతడి పెట్టించింది.  

‘‘ఈరోజుల్లో తల్లిదండ్రులకు తగిన ఆర్థిక స్తోమత లేకున్నా.. అంగరంగ వైభవంగా వివాహాలు జరిపిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. అయితే వైష్ణవి  ఉదంతం మమ్మల్ని కదిలించింది. ఇక నుంచి ఆర్భాటంగా వివాహాలు జరిపించొద్దని తల్లిదండ్రులను కోరుతున్నాం. వివాహాలను మేం ఏర్పాటు చేసిన  నియమావళి ప్రకారమే జరిపించాలని తీర్మానించాం’’ అని మరాఠా పెద్దలు ప్రకటించారు. 

ఈ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ప్రకారం.. వివాహాలు సాదాసీదాగానే జరిపించాలి. అత్తవారింట్లో కోడళ్లకు తగిన గౌరవం, సముచిత స్థానం లభించాలి. అత్తలు కోడళ్లను కూతుళ్లలా, కోడళ్లు అత్తలను తల్లులుగా భావిస్తూ వాళ్ల మధ్య బంధం సజావుగా సాగాలి. అలాగే.. వరకట్న వేధింపులు ఎదురైనప్పుడు ఆ తల్లిదండ్రులు ఎలా స్పందించాలి అనే విషయాలపైనా అవగాహన కల్పించే కార్యక్రమాలను రూపొందించాలని మరాఠా పెద్దలు తీర్మానించారు.

ఇదీ చదవండి: పెళ్లి కొడుకును ఎత్తుకెళ్లిపోయారు, చివరకు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement