పీఎం కేర్స్‌ ఫండ్‌ ప్రభుత్వానిది కాదు | PM CARES not government fund | Sakshi
Sakshi News home page

పీఎం కేర్స్‌ ఫండ్‌ ప్రభుత్వానిది కాదు

Sep 24 2021 4:36 AM | Updated on Sep 24 2021 4:36 AM

PM CARES not government fund - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విరాళాల వరదతో నిండుతున్న పీఎం కేర్స్‌ ఫండ్‌.. రాజ్యాంగానికి లోబడి కేంద్ర ప్రభుత్వ అధీనంలో కార్యకలాపాలు నిర్వహించదని పీఎం కేర్స్‌ ఫండ్‌ ఉన్నతాధికారి స్పష్టంచేశారు. ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం(పీఎంవో)లో ఉప కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న ప్రదీప్‌ కుమార్‌ శ్రీవాస్తవ గౌరవ హోదాలో పీఎం కేర్స్‌ ఫండ్‌ ట్రస్టు అత్యున్నత నిర్ణయక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ట్రస్టును కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలంటూ గతంలో ఢిల్లీ హైకోర్టులో సమ్యక్‌ గంగ్వాల్‌ ఒక పిటిషన్‌ వేశారు. ట్రస్టును సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెచ్చి, పారదర్శకంగా కార్యకలాపాలు కొనసాగేలా ఆదేశాలు జారీచేయాలంటూ మరో పిటిషన్‌ వేశారు.

ఈ రెండు పిటిషన్లపై ఉమ్మడి విచారణను ఢిల్లీ హైకోర్టు బుధవారం చేపట్టింది. దీనిపై స్పందనగా ప్రదీప్‌ శ్రీవాస్తవ కోర్టులో ఒక అఫిడవిట్‌ సమర్పించారు. పీఎం కేర్స్‌ ఫండ్‌ ట్రస్టు లావాదేవీలు పారదర్శకంగా ఉన్నాయని, కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) ప్యానెల్‌ నేతృత్వంలో ఎంపిక చేసిన చార్టెడ్‌ అకౌంటెంట్‌తో ట్రస్టు ఆడిటింగ్‌ పూర్తయిందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం కింద ‘థర్డ్‌పార్టీ’ వివరాలు ఇవ్వలేమన్నారు. తర్వాత పిటిషనర్‌ తరఫు లాయర్లు వాదించారు. ట్రస్టు కేంద్ర ప్రభుత్వానిది కానపుడు ట్రస్టు వెబ్‌సైట్‌ చిరునామాలో జౌఠి అనే ప్రభుత్వ డొమైన్‌ను, ప్రధాని మోదీ అధికారిక ఫొటోను, జాతీయ చిహ్నాన్ని వాడకుండా నిరోధించాలని కోర్టును కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement