జూలైలోనే పక్కాగా రెక్కీ | Parliament security breach: 4 people arrested for security breach in Parliament | Sakshi
Sakshi News home page

జూలైలోనే పక్కాగా రెక్కీ

Dec 15 2023 2:09 AM | Updated on Dec 15 2023 8:53 AM

Parliament security breach: 4 people arrested for security breach in Parliament - Sakshi

న్యూఢిల్లీ: అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంటులో పొగగొట్టాలతో కలకలం రేపిన నిందితులు ఇందుకు కొద్ది నెలల క్రితమే పక్కా ప్రణాళిక రచించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పార్లమెంట్‌లోకి పొగగొట్టాలను ఎలా దాచి తీసుకెళ్లాలన్న దానిపై రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌కు వచి్చన వారి షూలను తనిఖీ చేయట్లేరనే విషయాన్ని ‘రెక్కీ’ సందర్భంగా వీరు కనుగొన్నారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

నిందితుల్లో ఒకరైన మనోరంజన్‌ జులైలోనే ఈ మేరకు ఒకసారి సందర్శకుల పాస్‌తో లోపలికి వచ్చి రెక్కీ నిర్వహించాడని తెల్సింది. షూలు విప్పి తనిఖీలు చేయట్లేరనే విషయం గమనించి పొగ గొట్టాలను షూలో దాచి తెచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా లక్నోలో షూలను తయారుచేయించారట. మరోవైపు పార్లమెంట్‌లో ‘పొగ’ ఘటనకు కీలక సూత్రధారిగా భావిస్తున్న లలిత్‌ ఝాను గురువారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఘటనలో పాల్గొన్న మరో నలుగురిపాటు వారికి ఆశ్రయం కలి్పంచిన మరో వ్యక్తినీ అరెస్ట్‌చేశారు. లోక్‌సభ లోపల, వెలుపల పొగ గొట్టాలను విసిరిన నలుగురిపై కఠినమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా)సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నలుగురికీ ప్రత్యేక కోర్టు ఏడు రోజుల రిమాండ్‌కు పంపించింది. ఘటనకు కీలక సూత్రధారిగా భావిస్తున్న లలిత్‌ ఝా వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. కోల్‌కతాకు చెందిన ఇతడు విప్లవ యోధుడు భగత్‌ సింగ్‌ వీరాభిమాని.

లలిత్, సాగర్, మనోరంజన్‌ ఏడాది క్రితం మైసూర్‌లో కలిశారు. అప్పుడే పార్లమెంట్‌ లోపలికి చొరబడేందుకు ప్రణాళిక రచించారు. వీరికి తర్వాత నీలమ్‌ దేవి, అమోల్‌ షిండే తోడయ్యారు. ఫేస్‌బుక్‌లో భగత్‌సింగ్‌ ఫ్యాన్స్‌ క్లబ్‌ పేరుతో సృష్టించిన పేజీలో వీరంతా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేవారు. లలిత్‌ వీరిని ముందుండి నడిపాడు. ప్రణాళిక ప్రకారమే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌ అన్ని ప్రవేశ ద్వారాల వద్ద మనోరంజన్‌ రెక్కీ నిర్వహించాడు.

జూలైలో సందర్శకుల పాస్‌తో పార్లమెంట్‌ ప్రాంగణంలోకి వచ్చాడు. భద్రతా సిబ్బంది సందర్శకుల షూలను విప్పి తనిఖీ చేయడం లేదని విషయం గమనించాడు. ఆ మేరకు ప్రణాళిక సిద్ధమైంది. మంగళవారం రాత్రి గురుగ్రామ్‌లోని విశాల్‌ శర్మ అలియాస్‌ వికీ ఇంట్లో సాగర్, మనోరంజన్, అమోల్, నీలం, లలిత్‌లు బస చేశారు. ఉదయం అందరూ కలిసి పార్లమెంట్‌ వద్దకు చేరుకున్నారు. వీరి సెల్‌ఫోన్లను లలిత్‌ తన వద్దే ఉంచుకున్నాడు. పాస్‌లు ఇద్దరికి మాత్రమే రావడంతో మిగతా ముగ్గురు బయటే ఉండిపోయారు.

అమోల్, నీలమ్‌లు పార్లమెంట్‌ ఆవరణలో పొగ గొట్టాలు విసురుతుండగా లలిత్‌ వీడియో చిత్రీకరించాడు. అనంతరం ఈ వీడియోను అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. నిందితులిచ్చిన సమాచారం ఆధారంగా కోల్‌కతాకు చెందిన ఒక ఎన్‌జీవో నిర్వాహకుడు నీలా„Š  అయి‹Ùతో స్పెషల్‌ సెల్‌ పోలీసులు మాట్లాడారు. ఈ ఎన్‌జీవోతోనే లలిత్‌ ఝాకు సంబంధాలున్నట్లు భావిస్తున్నారు. దర్యాప్తు వేగవంతం చేసిన అధికారులు గురువారం రాత్రి లలిత్‌ ఝాను అదుపులోకి తీసుకున్నారు. ఇతడి ద్వారానే పార్లమెంట్‌ ఘటన వెనుక నిజాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.

వారం రోజుల రిమాండ్‌
పార్లమెంట్‌ భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన కేసులో పట్టుబడిన నలుగురిపై ఉపా చట్టంతోపాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. గురువారం మనోరంజన్, సాగర్, అమోల్, నీలమ్‌లను ‘పటియాలా’ కోర్టుకు తీసుకొచ్చి ఎన్‌ఐఏ కేసులను విచారించే జడ్జి ఎదుట హాజరుపరిచారు. జడ్జి ఏడు రోజుల రిమాండ్‌కు అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చారు.  

ఒకే రకమైన సమాధానాలు
సాగర్‌ శర్మ(26), మనోరంజన్‌(34), అమోల్‌ షిండే(25), నీలమ్‌ దేవి(37)లకు రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రిలో వైద్యుల బృందంతో పోలీసులు మెడికల్‌ పరీక్షలు చేయించారు. అనంతరం వీరిని చాణక్యపురిలోని డిప్లొమాటిక్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(డీఎస్‌ఎఫ్‌) కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ జరిపారు. ముందుగా, నీలమ్, అమోల్‌లను పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌స్టేషన్‌కు, తర్వాత డీఎస్‌ఎఫ్‌ కార్యాలయానికి తరలించారు. విచారణలో వీరు రెండు సంస్థల పేరు వెల్లడించారు. నిందితులు చెబుతున్న సమాధానాలన్నీ ఒకే రకంగా ఉండటాన్ని బట్టి చూస్తే, ముందుగానే ప్రిపేర్‌ అయినట్లుగా తెలుస్తోందని అధికారులు చెబుతున్నారు.

‘దేశంలో రైతుల ఆందోళనలు, మణిపూర్‌లో హింస, నిరుద్యోగం వంటి సమస్యలను చూసి నిరాశకు లోనై ఈ చర్యకు పాల్పడ్డాం. ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయడం కోసం, ఎంపీలు పై అంశాలపై చర్చ జరపాలనే ఉద్దేశంతో రంగుల పొగను వినియోగించాం. బ్రిటిష్‌ పాలనలో విప్లవయోధుడు భగత్‌ సింగ్‌ చేసినట్లుగా పార్లమెంట్‌లో అలజడి సృష్టించడం ద్వారా దేశ ప్రజల్లో ఇది చర్చనీయాంశంగా మారాలని భావించాం’ అని నలుగురు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు చెప్పారు. ఆధారాలు దొరక్కండా చేసేందుకే లలిత్‌ ఝా వీరి ఫోన్లను వెంటతీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. బహుశా అతడు వీటిని ధ్వంసం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement