మహిళా రైతులు, రైతు కూలీలపై ఆ దౌర్జన్యం ఏంటి? | NHRC Serious Over Alleged Attack on Women Farmers in Mamilapalli | Sakshi
Sakshi News home page

మహిళా రైతులు, రైతు కూలీలపై ఆ దౌర్జన్యం ఏంటి?

Jun 14 2026 5:31 AM | Updated on Jun 14 2026 5:31 AM

NHRC Serious Over Alleged Attack on Women Farmers in Mamilapalli

మామిళ్లపల్లి ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ, మహిళా కమిషన్‌ సీరియస్‌ 

టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల, పోలీసుల తీరుపై అభ్యంతరం

ఏపీ డీజీపీ, గుంటూరు ఎస్పీలకు నోటీసులు 

చట్టపరమైన చర్యలకు ఆదేశాలు

సాక్షి, న్యూఢిల్లీ: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో ఎస్సీ మహిళలు, రైతులపై ఇటీవల జరిగిన పోలీసుల దౌర్జన్యం, అక్రమ కేసుల నమోదు వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ), జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) తీవ్రంగా స్పందించాయి. బాధిత మహిళలు, రైతులకు అండగా నిలుస్తూ ఆంధ్రప్రదేశ్‌ డీజీపీకి, గుంటూరు ఎస్పీలకు నోటీసులు జారీ చేశాయి. 

రెండు వారాల్లో నివేదికకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం
వైఎస్సార్‌సీపీ నేత, ఎంపీ డాక్టర్‌ గుమ్మా తనూజ రాణి, మాజీ మంత్రి జోగి రమేష్, అంబటి మురళీకృష్ణ, బాధితురాలు సుడా త్రివేణి ఇచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఈ ఘటనపై విచారణను వేగవంతం చేసింది.  ఘటనపై దాఖలైన నాలుగు వేర్వేరు ఫిర్యాదుల సారాంశం ఒకటే కావడంతో వాటన్నింటినీ కలిపి ఒకే కేసుగా పరిగణించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. మహిళలపై పోలీసుల దాడికి సంబంధించిన వీడియో రికారి్డంగ్‌ను పెన్‌ డ్రైవ్‌ రూపంలో సాక్ష్యంగా స్వీకరించింది. మహిళల పట్ల మగ పోలీసులు వ్యవహరించిన తీరు చట్ట నియమాలకు విరుద్ధమని ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఈ ఆరోపణలపై ఏపీ డీజీపీ, గుంటూరు జిల్లా ఎస్పీ రెండు వారాల్లోగా తమ స్పందనను, సమగ్ర నివేదికను సమర్పించాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది.  

చర్యలకు మహిళా కమిషన్‌ ఆదేశాలు
ఇదే వ్యవహారంలో ఎస్సీ మహిళలపై పోలీసుల దాడి, అనుచిత ప్రవర్తనను జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) సైతం తీవ్రంగా పరిగణించింది. మే 27న అందిన ఫిర్యాదుల మేరకు అదే రోజు విచారణ చేపట్టింది. ఈ విషయాన్ని ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌ విజయ రహత్కర్‌ ఈ నెల 5న ఎంపీ తనూజ రాణికి లేఖ ద్వారా తెలియజేశారు. ఈ ఘటనను అత్యంత తీవ్రమైనదిగా పరిగణించిన కమిషన్, చట్టప్రకారం తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీని ఆదేశిస్తూ లేఖ రాసినట్లు అందులో తెలియజేసింది.

పోలీసుల దౌర్జన్యకాండ తీరిది..
మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ గత నెల 5న రైతులు శాంతియుతంగా ధర్నా చేశారు. ఈ క్రమంలో పొన్నూరు రూరల్‌ ఎస్సై శ్రీహరి.. ఎస్సీ రైతులు, మహిళలపైనే ఉద్దేశపూర్వకంగా ఎస్సీ, ఎస్టీ అట్రా­సిటీ చట్టం కింద తప్పుడు కేసులు బనాయించారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రోద్బలంతో, తహసీల్దార్‌ ద్వారా సుడా త్రివేణికి చెందిన గోదామును, అందులో రైతులు నిల్వ ఉంచిన 2,200 బస్తాల మొక్కజొన్నను అక్రమంగా సీజ్‌ చేశారు. 

మే 20న బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, అంబటి మురళీకృష్ణలను పోలీసులు దౌర్జన్యంగా అడ్డుకున్నారు. నాయకులను చేబ్రోలు పోలీస్‌ స్టేషన్‌కు తరలించి అక్రమంగా నిర్బంధించారు. అక్కడున్న ఎస్సీ మహిళలను మగ పోలీసులు అసభ్యంగా నెట్టివేస్తూ, తీవ్ర దాడికి పాల్పడ్డారు. అధికార పార్టీ నేత ఆదేశాలతో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. ఇందుకు సంబంధించి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, రూరల్‌ సీఐ కృష్ణయ్య, రూరల్‌ ఎస్సై శ్రీహరి, అర్బన్‌ సీఐ వీరా నాయక్, తెనాలి టూ టౌన్‌ సీఐ రాములు నాయక్,  చేబ్రోలు  ఎస్సై వీరనారాయణ తదితరులు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement