అజిత్ పవార్ మృతి కేసులో కొత్త మలుపు
విమాన ప్రమాదంపై ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఆరోపణ
బెంగళూరులో జీరో ఎఫ్ఐఆర్ నమోదు
సాక్షి బెంగళూరు: విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణానికి సంబంధించిన కేసు కొత్త మలుపు తీసుకుంది. విమాన ప్రమాదం వెనుక పెద్దకుట్ర ఉందని బెంగళూరు హైగ్రౌండ్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అజిత్ పవార్ అల్లుడు, ఎన్సీపీ (శరద్ పవార్) ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరులో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఫిర్యాదులో ఏముంది?
ఇది కేవలం ప్రమాదం కాదని, దీనివెనుక పెద్ద కుట్ర దాగి ఉండొచ్చని రోహిత్ పవార్ అనుమానించారు. ప్రమాదానికి కారణమైన విమానం ప్రయాణానికి అనుకూలంగా లేదని డీజీసీఏ నివేదిక వెల్లడించినట్టు గుర్తు చేశారు. విమాన ఇంజన్ కాలపరిమితి ముగింపు దశకు చేరుకున్నప్పటికీ వాణిజ్య వినియోగానికి ఉపయోగించారని ఆరోపించారు. అమెరికాలో సేవలకు స్వస్తి పలికిన విమానాన్ని భారతదేశానికి తీసుకొచ్చి ఉపయోగించారని విమర్శించారు. విమాన సమయాన్ని కూడా తక్కువగా చూపించారని, వాస్తవానికి విమానం 8 వేల గంటలకంటే ఎక్కువ సేపు ప్రయాణం సాగించినట్టు తెలుస్తోందన్నారు. చీఫ్ పైలట్ సుమిత్ కపూర్కు మద్యం అలవాటు ఉందని, గతంలో ఆయనను సస్పెండ్ చేశారని కూడా రోహిత్ ఆరోపించారు.
చివరి క్షణంలో సురక్షిత రన్వే కాదని ప్రమాదకర టేబుల్ టాప్ రన్వేను ఉపయోగించారన్నారు. విమానం కూలడానికి ముందు కోపైలట్ ‘ఓహ్ షిట్’ అని అరిచినప్పటికీ ముఖ్య పైలట్ ఎలాంటి అత్యవసర సందేశం పంపించకుండా మౌనంగా ఉండిపోయారని ఆరోపించారు. ప్రధాన పైలట్ సుమిత్ మద్యం మత్తులో ఉండటమో లేక ఉద్దేశపూర్వకంగా మౌనంగా ఉన్నారో తమకు అనుమానంగా ఉందన్నారు. ఇదొక వ్యవస్థీకృత కుట్రలో భాగంగా జరిగినట్టు అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. అజిత్ పవార్ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించాల్సి ఉందని, కానీ చివరి క్షణంలో విమాన ప్రయాణంగా మారిందని, దీని వెనుక ఎవరున్నారో తనిఖీ చేపట్టాలన్నారు. ప్రమాదం జరిగిన బారామతిలో దట్టమైన పొగమంచు అలుముకుందని, కనిష్టంగా 5 కిలోమీటర్ల విజిబిలిటీ లేకపోయినప్పకీ ల్యాండింగ్కు అవకాశం కల్పించినది ఎవరని ప్రశ్నించారు.


