
మధుర: శ్రీకృష్ణుడి జన్మస్థలంగా భావించే ఉత్తరప్రదేశ్లోని మధుర–బృందావన్లో వానరాల బెడద పెరిగిపోతోంది. భక్తుల వస్తువులు, తినుబండారాలను ఎత్తుకెళ్తుండడం పెద్ద తలనొప్పిగా మారింది. ప్రభుత్వ అధికారులు వాటి ఆగడాలను అదుపు చేయలేకపోతున్నారు. తాజాగా ఓ వ్యాపారి నుంచి రూ.20 లక్షలకుపైగా విలువైన వజ్రాల నగలున్న సంచిని కోతి ఎత్తుకెళ్లింది.
అలీగఢ్కు చెందిన అభిషేక్ అగర్వాల్ బంగారు అభరణాల వ్యాపారి. కుటుంబంతో కలిసి శుక్రవారం బృందావన్ దర్శనానికి వచ్చాడు. తమ వద్దనున్న నగలను ఓ సంచిలో భద్రపర్చాడు. దర్శనం పూర్తయిన తర్వాత ఇంటికి చేరుకోవడానికి కారు వద్దకు వెళ్తుండగా ఓ కోతి హఠాత్తుగా ఎక్కడి నుంచో వచ్చి, ఆ సంచిని లాక్కెళ్లింది. ఆందోళనకు గురైన అభిషేక్ అగర్వాల్ వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు దొంగ మర్కటం కోసం వేట ప్రారంభించారు. 8 గంటల తర్వాత దాని ఆచూకీ కనిపెట్టారు. అదృష్ట ఏమిటంటే నగల సంచి దాని దగ్గరే ఉంది. కోతిని అక్కడి నుంచి వెళ్లగొట్టి, నగల సంచిని జాగ్రత్తగా తీసుకొచ్చి, బాధితుడికి అప్పగించారు.