Mizoram: పరీక్షలు రాయాలి.. సిగ్నల్స్‌ రావడం లేదు | Mizoram Students Climb Hill To Catch Signal For Online Test Video Viral | Sakshi
Sakshi News home page

Mizoram: పరీక్షలు రాయాలి.. సిగ్నల్స్‌ రావడం లేదు

Jun 8 2021 8:26 AM | Updated on Jun 8 2021 11:43 AM

Mizoram Students Climb Hill To Catch Signal For Online Test Video Viral - Sakshi

ఐజ్వాల్‌: కరోనా మహమ్మారితో స్కూళ్లు, కాలేజీలు మూతపడడంతో విద్యార్థులంతా ఆన్‌లైన్‌ క్లాసులకే పరిమితమయ్యారు. క్లాసులతో పాటు పరీక్షలు కూడా ఆన్‌లైన్‌లో రాయాల్సి వస్తుంది. మహానగరాలు, పట్టణాల్లో అయితే ఇంటర్నెట్‌ సేవలు బాగుంటాయి.. కాబట్టి ఆన్‌లైన్‌లో పరీక్షలు రాయడం కాస్త తేలికే.. అదే మారుమూల గ్రామాల్లో కనీసం సిగ్నల్స్‌ కూడా అందవు. ఇక గిరిజన ప్రాంతాల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సిగ్నల్స్‌ కోసం కొండలు, గుట్టలు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది.


తాజాగా మిజోరంలో కొందరు విద్యార్థులకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. రాజధాని ఐజ్వాల్‌కు 400 కిమీ దూరంలో సైహా జిల్లాలో మావ్రేయి అనే కూగ్రామం ఉంది. ఆ గ్రామం నుంచి ఏడుగురు విద్యార్థులు తమ సెమిస్టర్‌ పరీక్షలు రాయాల్సి ఉంది. గ్రామంలో ఇంటర్నెట్‌ సౌకర్యం లేకపోవడం.. ఫోన్‌లో సిగ్నల్స్‌ కూడా అంతంత మాత్రానే ఉంటుంది. అయితే కాలేజీ యాజమాన్యం పరీక్షలు రాయకపోతే ఫెయిల్‌ చేస్తారేమోనని ఆ విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఎలాగైనా పరీక్షలు రాయాలని ఊరికి దగ్గర్లోని త్లావ్ త్లా కొండపై ఫోన్‌ సిగ్నల్‌ వస్తుండడంతో ఆ విద్యార్థులంతా ఎలాగోలా కష్టపడి అక్కడికి చేరుకున్నారు.

ఆ కొండపైనే ఒక గుడిసెను ఏర్పాటు చేసుకున్న విద్యార్థుల సమూహం తమ సెమిస్టర్‌ పరీక్షలను పూర్తి చేస్తున్నారు. '' మా గ్రామం పూర్తిగా కొండల నడుమ ఉంది. గ్రామంలో ఫోన్‌ సిగ్నల్స్‌ కూడా సరిగా రావు.. ఇంక ఇంటర్నెట్‌ సంగతి వేరే చెప్పనవసరం లేదు. అందుకే కొండపైకి చేరుకొని సెమిస్టర్‌ పరీక్షలు పూర్తి చేస్తున్నాం'' అంటూ ఒక విద్యార్థి పేర్కొన్నాడు. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: వామ్మో.. ఆ రాష్ట్రంలో లక్ష దాటిన కరోనా మరణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement