
మహరాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయాణికులకు మాత్రం క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది.
ముంబై : దేశంలో కోవిడ్ మళ్లీ బుసలు కొడుతోంది. దీంతో అంతర్జాతీయ, దేశీయ ప్రయాణికులను తప్పనిసరిగా క్వారంటైన్ను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఈ విషయంలో మహరాష్ట్ర ప్రభుత్వం కొంత మంది ప్రయాణికులకు మాత్రం క్వారెంటైన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఆ జాబితాలో యూరప్, మిడిల్ ఈస్ట్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులు రెండు మోతాదుల కోవిడ్-19 వ్యాక్సిన్ను తీసుకున్నవారికి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చింది.
ఇందులో 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు, గర్భంతో ఉన్న మహిళలు, ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నపిల్లల తల్లిదండ్రులను చేర్చింది . వీరితో పాటు క్యాన్సర్, తీవ్రమైన శారీరక వైకల్యం, మానసిక అనారోగ్యం వంటి తక్షణ వైద్య సహాయం అవసరమయ్యే ప్రయాణీకులకు ఆ వెసలుబాటుని కల్పించింది, కాకపోతే వారు మెడికల్ సర్టిఫికేట్ను కలిగి ఉండాలి. అత్యవసర శస్త్ర చికిత్సలు చేయడం కోసం ప్రయాణించాలనుకునే వైద్యులను కూడా మినహాయించారు. వీరు శస్త్రచికిత్స చేయటానికి వెళ్తున్నట్లు సంబంధిత ఆసుపత్రి నుంచి ధృవీకరణ పత్రాన్ని చూపించాల్సి ఉంటుంది. ఈ జాబితాలో లేని ప్రయాణికులకు క్వారంటైన్ను తప్పనిసరి చేసింది.
వివిధ దేశాల నుంచి మహరాష్ట్రకు వచ్చే ప్రయాణీకుల నెగిటివ్ రిపోర్ట్ తో సంబంధం లేకుండా వారిని 7 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రదేశంలో క్వారంటైన్లో ఉంచనుంది. దేశంలో కోవిడ్-19 కేసుల పెరుగుతున్నట్లు నివేదికలు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి మార్గదర్శకాలను విడుదల చేసింది. ( చదవండి : వ్యోమగాములకు తప్పని క్వారంటైన్ )