Madras High Court : మాతృభాషలో చదవడం, రాయడం వస్తేనే ప్రభుత్వ ఉద్యోగం.. | Madras High Court Ruled Tamil Proficiency Mandatory For Government Jobs | Sakshi
Sakshi News home page

Madras High Court : మాతృభాషలో చదవడం, రాయడం వస్తేనే ప్రభుత్వ ఉద్యోగం..

Mar 12 2025 7:41 PM | Updated on Mar 12 2025 7:45 PM

Madras High Court Ruled Tamil Proficiency Mandatory For Government Jobs

చెన్నై: జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు- కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతున్న వేళ మద్రాస్‌ హైకోర్టు మదురై బెంచ్‌ కీలక వ్యాఖ్యాలు చేసింది. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే వారికి తప్పని సరిగా తమిళంలో చదవడం, రాయడం వ‌చ్చి ఉండాల‌నే అభిప్రాయం వ్యక్తం చేసింది.  

తమిళనాడు విద్యుత్ బోర్డు (TNEB)లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం పొందాలంటే తప్పని సరిగా తమిళ భాష పరీక్ష (Tamil Language Test)లో తప్పని సరిగా ఉత్తీర్ణత సాధించాలి. లేదంటే ఉద్యోగానికి అనర్హులు. టీఎన్ఈబీ నిర్వ‌హించిన త‌మిళ లాంగ్వేజ్ టెస్టులో ఫెయిలైన అభ్య‌ర్థి ఇదే అంశాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఆ పిటిష‌న్‌పై విచార‌ణ స‌మ‌యంలో హైకోర్టు కోర్టు ధ‌ర్మాస‌నం తమిళ మాతృభాష గురించి ప్రస్తావించింది.

త‌మిళ‌నాడు రాష్ట్రం తేని జిల్లాకు చెందిన జే.జైకుమార్ రాష్ట్ర విద్యుత్ శాఖ ఉద్యోగి. అయితే జైకుమార్ రెండేళ్ల‌లో త‌మిళ లాంగ్వేజ్ ఎగ్జామ్ పాస్ అవ్వాల్సింది. కానీ పాస‌వ్వ‌లేదు. దీంతో విద్యుత్ శాఖ అత‌న్ని విధుల నుంచి తొల‌గించింది. త‌మిళ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఫెయిల్ కావ‌డంతో ప్ర‌భుత్వ ఉద్యోగం కోల్పోయాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ త‌మిళ‌నాడు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. తన తండ్రి నావల్ సర్వీస్‌లో పని చేయడం వల్ల తాను సీబీఎస్‌ఈ స్కూల్లో చదివానని, అందువల్ల తాను తమిళం నేర్చుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.  

ఆ పిటిష‌న్‌పై జి జయచంద్రన్, ఆర్ పూర్ణిమా ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. విచార‌ణ‌లో భాగంగా  పిటిష‌న‌ర్‌కు మాతృభాష తమిళం రాకపోవడంపై పిటిషనర్‌కు పలు ప్రశ్నలు సంధించింది. ప్రభుత్వ ఉద్యోగులు తమిళం రాకుండా ఎలా పని చేయగలరు? రోజువారి పనులను ఎలా చేస్తారు? ఏ రాష్ట్రంలోనైనా, ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర భాష తెలియాలి. అలా లేనిపక్షంలో ఉద్యోగాలు ఎలా చేస్తారు?’అని బెంచ్ వ్యాఖ్యానించింది.

అభ్యర్థులు ప్రభుత్వ భాష పరీక్షను నిర్ణీత సమయంలో పాసవాలని, తమిళ భాష నేర్చుకుని ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అనంతరం, ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కేసును ఆరువారాల పాటు వాయిదా వేసింది.

Advertisement
 
Advertisement
Advertisement