ఒక్క అవకాశం ఇవ్వండి.. కీలక ప్రకటన చేసిన కేజ్రీవాల్
భోపాల్: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. రాబోయే మధ్యప్రదేశ్ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారాయన. ఈ మేరకు ఆ రాష్ట్రంలో గెలిపిస్తే.. ఉచిత కరెంట్, విద్య, ఆరోగ్యభద్రత ఉంటుందని మధ్యప్రదేశ్ ప్రజలకు హామీ ఇచ్చారాయన.
మంగళవారం బీహెచ్ఈఎల్లోని దసరా మైదాన్లో ఏర్పాటు చేసిన జనసభలో ప్రసంగిస్తూ.. కేజ్రీవాల్ పై ప్రకటన చేశారు. అంతేకాదు.. మధ్యప్రదేశ్లో అధికారంలోకి వస్తే గనుక ఉద్యోగులను రెగ్యులైజ్ చేస్తామని, అవినీతికి చరమగీతం పాడతామని పేర్కొన్నారాయన.
ఢిల్లీ, పంజాబ్లలో ఆప్ ప్రభుత్వాల పని తీరును ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన.. మధ్యప్రదేశ్లోనూ ఆప్కు ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సభలో కేజ్రీవాల్తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు.