దాహం తీరేలా..
● 28 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరు
● జీడీపీ నుంచి హంద్రీ తీర గ్రామాలకు తాగునీరు కర్నూలు(అర్బన్): పలు మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఇప్పటికే ఉత్పన్నమైన తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలను చేపట్టింది. సమీపంలోని వ్యవసాయ బోర్లను ఆద్దెకు తీసుకొని ట్యాంకర్ల ద్వారా గ్రామ ప్రజల అవసరాల మేరకు నీటిని అందించే కార్యక్రమాన్ని ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లు ప్రారంభించారు. ప్రస్తుత వేసవిలో తప్పక నీటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయని ముందుగానే ఒక అంచనాకు వచ్చిన అధికారులు వేసవి ప్రారంభం కాక ముందే గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ద్వారా గ్రామ ప్రజల జనాభా, నీటి అవసరాలపై వాటర్ ఆడిట్ నిర్వహించారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు జిల్లాలోని వేర్వేరు మండలాల్లోని 128 గ్రామాల్లో నీటి సమస్య తలెత్తుందనే ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్ నిర్వహించిన ఆడిట్ నివేదికలను ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ద్వారా ఎంపీడీఓ, జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా కలెక్టర్కు పంపారు. జిల్లా కలెక్టర్ పంపిన నివేదికలపై ఆయా నెలల్లో ఆయా ప్రాంతాల్లో ఉత్పన్నమయే నీటి సమస్యను అధిగమించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఈ మేరకు ప్రస్తుతం తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొన్న 28 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. నీటి సరఫరాలో ఎక్కడా అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఆర్డబ్ల్యూఎస్ యాప్ ద్వారా ట్రిప్పులను లెక్కగడుతున్నారు. ఆయా గ్రామాల్లో జనాభాను బట్టి మూడు నుంచి ఐదు ట్రిప్పుల వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఇందుకు 5 కిలోమీటర్ల దూరానికి ఒక ట్రిప్పుకు రూ.567, 10 కిలోమీటర్లకు రూ.718, 15 కిలోమీటర్లకు రూ.869లను చెల్లించనున్నారు. అలాగే జూన్ నెల వరకు నీటి ఎద్దడి తలెత్తనున్న గ్రామాల ప్రజలకు నీటిని అందించేందుకు ఇప్పటికే రూ.12 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు.
జీడీపీ నుంచి హంద్రీ తీర గ్రామాలకు ...
హంద్రీనది తీర గ్రామాల్లోని ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జలవనరుల శాఖ,ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్ల సమన్వయ ంతో ప్రత్యేక చర్యలు చేపట్టారు.హంద్రీ తీరం వెంట ఉన్న గోనెగండ్ల, కోడుమూరు, గూడురు మండలా ల్లోని పలు గ్రామాలకు గాజులదిన్నె ప్రాజెక్టు నీటిని అందిస్తున్నారు. జీడీపీ నుంచి ఇప్పటికే రెండు పర్యాయాలు హంద్రీకి నీటిని విడుదల చేయడం వల్ల ప్ర ధానంగా కోడుమూరు దాహార్తిని కొంతమేర తీర్చడ ంతోపాటు పలు గ్రామాలకు నీటిని అందిస్తున్నారు.
28 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ...
నీటి ఎద్దడి నెలకొన్న పుప్పాలదొడ్డి, తొగలగల్లు, తురవగళ్లు, తంగరడోణ, కల్లుదేవకుంట, చెట్నేహళ్లి, సోయాజులపల్లి, హుసేనాపురం, శకునాల, తిప్పాయిపల్లి, చెన్నంశెట్టిపల్లి, వెంకటాపురం, పెరవలి, రేమట, గువ్వలకుంట్ల, చిన్న జొన్నగిరి, జొన్నగిరి, హుసేనాపురం, బాటతాండా, పగిడిరాయి కొత్తూరు, దేశాయితాండా, వాగులగుడిసెలు, గుడిసెగుప్పరాళ్ల, పీ చింతలకొండ, శభాష్పురం, కడమకుంట్ల, తుగ్గలి గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.