శభాష్‌ అంజలి.. మంచి పని చేశావ్‌!

Instead Of 75 Lakh Dowry, Rajasthan Bride Asks For Construction Of Girls Hostel - Sakshi

కట్నం డబ్బును మంచి పనికి వినియోగించి శభాష్‌ అనిపించుకుంది ఓ పెళ్లికూతురు. పెద్ద మొత్తంలో నగదును సమాజ సేవకు అందించి ఆదర్శంగా నిలిచింది. ఈ విషయం తెలిసిన వారందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసింది?

రాజస్థాన్‌లోని బార్మర్ నగరానికి చెందిన కిషోర్ సింగ్ కనోడ్ కుమార్తె అంజలి కన్వర్ నవంబర్ 21న ప్రవీణ్ సింగ్‌ను వివాహం చేసుకుంది. తనకు కట్నంగా ఇవ్వాలనుకున్న 75 లక్షల రూపాయలను బాలికల హాస్టల్ నిర్మాణానికి వినియోగించాలని పెళ్లికి ముందే తండ్రితో చెప్పింది. కుమార్తె కోరినట్టుగానే ఈ మొత్తాన్ని బాలికల హాస్టల్ నిర్మాణానికి విరాళంగా ఇచ్చేశాడు కిషోర్ సింగ్. (చదవండి: ‘సార్‌ వీడు నా పెన్సిల్‌ తీసుకున్నాడు.. కేసు పెట్టండి’)

ఈ విషయాన్ని లేఖ ద్వారా పెళ్లికి వచ్చిన అతిథులకు తెలియజేయగా కరతాళ ధ్వనులతో వారందరూ స్వాగతించారు. అంజలి తండ్రి పెళ్లి పందిట్లోనే ఖాళీ చెక్కును కూతురికి అందించి.. ఆమె అభీష్టాన్ని నెరవేర్చారు. బాలికల విద్య కోసం కట్నం సొమ్మును త్యాగం చేసిన అంజలి మంచి మనసును అక్కడున్నవారంతా మెచ్చుకున్నారు. 68వ జాతీయ రహదారికి సమీపంలోని నిర్మితమవుతున్న బాలికల వసతి గృహానికి కిషోర్ సింగ్ ఇప్పటికే కోటి రూపాయాలు ప్రకటించారు. అయితే నిర్మాణం పూర్తికావడానికి 50 నుంచి 75 లక్షలు అదనంగా ఖర్చు చేయాల్సి రావడంతో అంజలి ఈ నిర్ణయం తీసుకుంది. (చదవండి: నీలగిరి ‘తోడాలు’.. పాండిచ్చేరి చాపనేత.. ఎన్నెన్నో విశేషాలు!)

దీనికి సంబంధించిన కథనాన్ని ‘దైనిక్ భాస్కర్‌’ పత్రిక ప్రచురించింది. ఈ వార్తా కథనం క్లిప్పింగ్‌ను త్రిభువన్ సింగ్ రాథోడ్ అనే వ్యక్తి  ట్విటర్‌లో షేర్ చేశారు. దీంతో అంజలి కన్వర్‌పై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్ఫూర్తిదాయకంగా నిలిచావంటూ పొగడుతున్నారు. (చదవండి: అనుపమ అలుపెరగని పోరాటం.. ఎట్టకేలకు చెంతకు చేరిన బిడ్డ!!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top