మేడిన్‌ ఇండియా ఎలక్ట్రానిక్స్‌ | India has made great progress in electronics manufacturing | Sakshi
Sakshi News home page

మేడిన్‌ ఇండియా ఎలక్ట్రానిక్స్‌

Jun 27 2025 4:24 AM | Updated on Jun 27 2025 4:24 AM

India has made great progress in electronics manufacturing

2023–24లో రూ. 9.5 లక్షల కోట్ల ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి

తొమ్మిదేళ్లలో అయిదు రెట్లు దూసుకెళ్లిన పరిశ్రమ

మనం వినియోగిస్తున్న ఫోన్లలో 99% భారత్‌లో తయారీ

విడిభాగాల తయారీకి రూ.22,919 కోట్ల పీఎల్‌ఐ పథకం

ఎలక్ట్రానిక్స్‌ తయారీలో భారత్‌ చాలా పురోగతి సాధించింది. దశాబ్దంలో వచ్చిన మార్పును చూస్తే ఔరా అనిపించాల్సిందే. ఇందుకు స్మార్ట్‌ఫోన్స్‌ను ఉదాహరణగా చెప్పవచ్చు. యాపిల్‌ ఫోన్లూ భారత్‌లో రూపుదిద్దుకుంటున్నాయి. 2014లో దేశంలో వినియోగించిన ఫోన్లలో 30 శాతంలోపు దేశీయంగా అసెంబుల్‌ అయితే.. 2024 వచ్చే సరికి ఇది 99 శాతం దాటిందంటే ఎలక్ట్రానిక్స్‌ రంగంలో భారత దూకుడును అర్థం చేసుకోవచ్చు. ఉపకరణాల తయారీలో వినియోగించే విడిభాగాలను దేశీయంగా ఉత్పత్తి చేయడం ద్వారా ‘ఎలక్ట్రానిక్స్‌ హబ్‌’గా అవతరించే దిశగా భారత్‌ దూసుకుపోతోంది. – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

ఏటా కొత్త మైలురాళ్లు..
మొబైల్‌ ఫోన్స్, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్‌ ఎలక్ట్రానిక్స్‌.. ఇలా విభాగం ఏదైనా తయారీపరంగా భారత్‌లో ఏటా కొత్త మైలురాళ్లు నమోదవుతున్నాయి. దేశంలో తయారైన ఎలక్ట్రానిక్స్‌ విలువ 2014–15లో రూ. 1.9 లక్షల కోట్లుగా ఉంటే 2023–24 నాటికి ఐదురెట్లు పెరిగి రూ. 9.5 లక్షల కోట్లకు చేరుకోవడం ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగంలో భారత్‌లో జరుగుతున్న పురోగతికి నిదర్శనం. 

అయితే మొబైల్‌ ఫోన్ల అసెంబ్లింగ్‌ కొత్త రికార్డులకు ప్రధానంగా రూ. 1.9 లక్షల కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం కారణం. 2024–25లో భారత్‌ నుంచి స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు రూ. 2 లక్షల కోట్లు దాటాయి. ఎలక్ట్రానిక్స్‌ తయారీలో వినియోగించే విడిభాగాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు పీఎల్‌ఐ పథకం ప్రకటించడం ఈ రంగంలో పెద్ద అడుగు పడినట్టు అయింది.

ఈసీఎంఎస్‌తో ఊతం..
విడిభాగాల తయారీ కంపెనీలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ. 22,919 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్‌ కాంపోనెంట్‌ తయారీ పథకం (ఈసీఎంఎస్‌) ప్రారంభించింది. ఈ పథకం 2031–32 వరకు కొనసాగుతుంది. కెమెరా మాడ్యూల్స్, డిస్‌ప్లేలు, మల్టీ లేయర్‌ పీసీబీలు సహా వివిధ విడిభాగాల తయారీని ప్రోత్సహించనుంది. 

రూ. 59,350 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, రూ. 4.5 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి సాధించడం, కొత్తగా 91,600 మందికి ప్రత్యక్షంగా ఉపాధిని కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి ఇప్పటికే 70 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 80% చిన్న, మధ్యతరహా కంపెనీలు ఉన్నాయి. టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్‌కాన్, డిక్సన్‌ టెక్నాలజీస్‌ వంటి పెద్ద కంపెనీలు సైతం దరఖాస్తు చేసిన కంపెనీల జాబితాలో ఉన్నాయని సమాచారం. 

అసెంబ్లింగ్‌ను మించితేనే..
ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్‌ ఎదగాలంటే విడి­భాగాల తయారీలో దూసుకుపోవాలి. అసెంబ్లింగ్‌కు పరిమితం కాకుండా తయారీ దిశగా అభివృద్ధి చెందాలన్నది నిపుణుల అభిప్రాయం. మొబైల్‌ ఫోన్లను తయారు చేయడానికి దేశీయంగా ఉన్న ఎలక్ట్రానిక్‌ తయారీ సేవలు లేదా కాంట్రాక్ట్‌ తయారీ కంపెనీలు కెమెరాలు, డిస్‌ప్లేలు, హై–ఎండ్‌ బ్యాటరీ ప్యాక్‌లు, సెమీకండక్టర్లు, ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డుల వంటి కీలక భాగాల దిగుమతులపై ఆధారపడుతున్నాయి. 

ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులైన స్మార్ట్‌ టీవీలు, సీసీటీవీ కెమెరా­లు, కంప్యూటర్లు, వేరబుల్స్, హియరబుల్స్‌ను సైతం దిగు­మతి చేసుకున్న విడిభాగాలతోనే అసెంబుల్‌ చే­çస్తు­న్నా­రు. విడిభాగాలు ఇప్పటికీ చైనా, కొరియా, తైవా­న్‌ నుంచి ప్రధానంగా సరఫరా అవుతున్నాయి. ఎల­క్ట్రా­నిక్స్‌ విడి­భాగాల విలువలో దిగుమతుల వాటా ఏకంగా 85–90% ఉందని ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement