ఆరుగురు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు | Himachal Pradesh Crisis: Speaker To Pronounce Verdict On 6 Rebel Congress MLAs | Sakshi
Sakshi News home page

Himachal Pradesh: ఆరుగురు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు

Feb 29 2024 12:01 PM | Updated on Feb 29 2024 1:25 PM

Himachal Pradesh Crisis Verdict on 6 Rebel Congress MLAs - Sakshi

హిమాచల్‌ ప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల అనంతరం నెలకొన్న రాజకీయ గందరగోళం మరో మలుపు తిరిగింది. ఆరుగురు ​కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయ్యింది. కాంగ్రెస్ పిటిషన్‌ నేపధ్యంలో స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా ఈ నిర్ణయం తీసుకున్నారు. ధర్మశాల ఎమ్మెల్యే సుధీర్ శర్మ, సుజన్‌పూర్ ఎమ్మెల్యే రాజేంద్ర రాణా, కుత్లహర్ ఎమ్మెల్యే దేవేంద్ర భుట్టో, గాగ్రెట్ ఎమ్మెల్యే చైతన్య శర్మ, లాహౌల్ స్పితి ఎమ్మెల్యే రవి ఠాకూర్, బాద్సర్ ఎమ్మెల్యే ఇంద్ర దత్ లఖన్‌పాల్  తదితరులు సభ్యత్వం రద్దయిన ఎమ్మెల్యేల జాబితాలో ఉన్నారు. 

ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్ ఈ నిర్ణయం తీసుకుని వీరందరినీ అనర్హులుగా ప్రకటించారు. ఈ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎన్నికల అభ్యర్థి హర్ష్ మహాజన్‌కు అనుకూలంగా ఓటు వేశారు. ఈ ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేల  సభ్యత్వాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌ను రాష్ట్ర బడ్జెట్‌  సమావేశంలో ఇతర సభ్యులు లేవనెత్తారు.

బుధవారం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్‌ను ఆమోదించింది. మరోవైపు భోజన విరామానికి ముందు భారతీయ జనతా పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇది కాకుండా మిగిలిన ఎమ్మెల్యేలు తమ మాట విననందుకు నిరసనగా సభను బహిష్కరించారు. సభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లేకపోవడంతో అధికార పక్షానికి అనుకూలంగా మూజువాణి ఓటుతో బడ్జెట్ ఆమోదం పొందింది. అనంతరం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కార్యకలాపాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు తలెత్తకపోతే, తదుపరి సమావేశాలు జూలై, ఆగస్టులలో వర్షాకాల సమావేశాలుగా ప్రారంభమయ్యే అవకాశముంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement