
కాన్పూర్: ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ కు వణుకు పుట్టించిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి గుర్తు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ నిద్రలేని రాత్రులు ఎలా ఉంటాయో చూపెట్టామన్నారు మోదీ. ఈ రోజు(శుక్రవారం) యూపీలోని కాన్పూర్ పర్యటనలో భాగంగా మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
‘ఆపరేషన్ సిందూర్.. దేశ రక్షణ వ్యవస్థ ఎంత బలంగా ఉందో ప్రపంచానికి తెలిసేలా చేసింది. బ్రహ్మోస్ క్షిపణి తరహా రక్షణ వ్యవస్థ కల్గిన మనదేశ సామర్థ్యంతో పాక్ ను చావుదెబ్బ కొట్టాం. ఉగ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యంతో చేపట్టిన ఈ ఆపరేషన్ సిందూర్.. పాకిస్తాన్ మూలాల్లోకి పోయి మరీ విధ్వంసం సృష్టించాం. ప్రధానంగా బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగంతో పాక్ కు ఊపిరి సలపలేదు.
ఇది భారత్ దేశ శత్రువులకు ఒక హెచ్చరిక లాంటిది. మమ్మల్ని తక్కువ అంచనా వేసే వారికి కూడా ఇది ఒక గుణపాఠం. ఆపరేషన్ సిందూర్ అనేది ఒక ఆరంభం మాత్రమే.. ఇది ఇంకా ముగిసిపోలేదు. దీన్ని మరిచిపోవద్దు’ అంటూ ప్రధాని మోదీ హెచ్చరించారు. పాకిస్తాన్ పాత కాలంలో రాష్ట్ర, రాష్ట్రేతర సంస్థల మధ్య తేడాను చూపించే ఆట ఇకపై పనిచేయదు’ అని మోదీ క్లియర్ మెసేజ్ ఇచ్చారు.