కేరళలో సీపీఎం, బీజేపీల స్నేహం కొత్తేమీ కాదు
ఎన్నికల్లో ఒకరికొకరు సహాయం
కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్
కొచ్చి: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం, బీజేపీ పార్టీలు పరస్పర సహకారంతో పనిచేస్తున్నాయని కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. రాష్ట్రంలో సీపీఎం, బీజేపీల స్నేహం కొత్తేమీ కాదని, కానీ ఈసారి ఆ పొత్తు విజయం సాధించదని స్పష్టం చేశారు. ప్రజలు తమకు వ్యతిరేకంగా ఉన్నారని, సీపీఎం, ఎల్డీఎఫ్లకు అర్థమైందని, అందుకే వారు తమ చివరి ఎత్తుగడ వేస్తున్నారని ఆరోపించారు.
ఆదివారం స్థానిక మీడియాతో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిపై ఉన్న లావ్లిన్ కేసు వాయిదా పడటం, కేరళలో కేంద్ర దర్యాప్తు సంస్థల వేగం, పీఎం–శ్రీ వంటి అంశాలు.. కేంద్ర ప్రభుత్వం, వామపక్ష పార్టీ సంబంధాలేంటో స్పష్టమవుతున్నాయని కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రెండు పార్టీల అభ్యర్థుల జాబితాల్లోనూ ఇదే సంబంధం ప్రతిబింబించిందని, ఎన్నికల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవాలని ఇరు పార్టీలు ఒప్పందం చేసుకున్నాయని వేణుగోపాల్ ఆరోపించారు. కానీ ఈ ఒప్పందాన్ని పార్టీ కార్యకర్తలు తిరస్కరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
త్వరలో మేనిఫెస్టో...
రాష్ట్రం కోసం నిర్దిష్ట ప్రాజెక్టులు, ప్రణాళికలతో మేనిఫెస్టోను త్వరలో విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలో యూడీఎఫ్ అధికారంలోకి వస్తే మహిళలకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని పునరుద్ఘాటించారు. కొబ్బరి పీచు, జీడిపప్పు, మత్స్య, చేనేత రంగాల్లో, అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తూ, పూటగడవడమే ఇబ్బందిగా ఉన్న మహిళల జీవితాల్లో ఇది విప్లవాత్మక మార్పు తెస్తుందన్నారు.
చదవండి: కేరళ సీఎం విజయన్ ఆస్తులు ఇవే..
ఈ పథకం కేఎస్ఆర్టీసీపై ఆర్థిక భారం మోపుతుందనే విమర్శలను ఆయన తోసిపుచ్చారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమాలను ఇప్పటికే అమలు చేశామని వేణుగోపాల్ పేర్కొన్నారు. రవాణా సంస్థలోని సమస్యలను పరిష్కరించడానికి యూడీఎఫ్ వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందన్నారు. ఈ ఎన్నికల్లో యూడీఎఫ్ వంద స్థానాలను గెలుచుకుంటుందననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.


