ఛత్తీస్గఢ్లో ఒక మహిళా డీఎస్పీపై కేసు నమోదయ్యింది. కల్పనాఅనే మహిళా డీఎస్పీ తన వద్ద నుంచి రూ.రెండు కోట్ల రుపాయలు కాజేసిందని దీపక్ థండన్ అనే వ్యాపార వేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడితో ఆగకుండా తన భార్యకు విడాలకులిచ్చి తనను పెళ్లి చేసుకోవాలని తీవ్ర వేధింపులకు గురిచేస్తోందని తెలిపారు.
ఛత్తీస్గఢ్ రాయిపూర్కు చెందిన దీపక్ థండన్ అనే వ్యాపారవేత్త, కల్పనా అనే మహిళా డీఎస్పీపై సంచలన ఆరోపణలు చేశారు. కల్పనా తనను తీవ్రంగా వేధిస్తుందని తెలిపారు. 2021లో తామిద్దరం తొలిసారిగా కలుసుకున్నామని కొద్దిరోజులకే ఇద్దరం సన్నిహితంగా మెదిలామన్నారు. ఆ తర్వాత నుంచి కల్పనా తన వద్ద నుంచి పెద్ద మెుత్తంలో డబ్బు గుంజసాగిందన్నారు. తనకు రూ.12 లక్షల విలువ గల డైమండ్ రింగ్ కానుకగా ఇచ్చానని, రాయ్పూర్లో ఉన్న ఒక హోటల్ తన సోదరుడి పేరు మీదకు మార్చేలా ఒత్తిడి తెచ్చిందని తెలిపారు.
ఆ తర్వాత కొంతకాలానికే కల్పనా రూ.30 లక్షలు విలువజేసే మరో ప్రాపర్టీ తన పేరు మీదకు మార్చాలనడంతో ఆ విధంగా చేశానన్నారు. అంతేకాకుండా తనకు రూ. 22లక్షల విలువైన కారును బహుమతిగా ఇచ్చానని ఆ వాహనం తన భార్య పేరు మీద తీసుకున్నానని తెలిపారు. కాగా ఇప్పుడు తన భార్యకు విడాకులిచ్చి తనను పెళ్లిచేసుకోవాలని వేధిస్తోందని తెలిపారు. తమ సంబంధం విషయం తన భార్యకు తెలియడంతో ఇంట్లో గొడవలు జరిగాయని దీపక్ అన్నారు.
ఈ నేపథ్యంలో డీఎస్పీ వేధింపులు తట్టుకోలేక తన భార్యతో కలిసి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను డీఎస్పీ కల్పనా కొట్టిపడేసింది. ఆ వ్యాఖ్యలన్ని నిరాధారమైనవని తెలిపింది.


