కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీతో మరోసారి రేవంత్ భేటీ | CM Revanth Reddy Meets Union Minister Pralhad Joshi | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీతో మరోసారి రేవంత్ భేటీ

Mar 4 2025 5:49 PM | Updated on Mar 4 2025 6:07 PM

CM Revanth Reddy Meets Union Minister Pralhad Joshi

ఢిల్లీ : కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి సమావేశమయ్యారు.  2024 25 సంవత్సరానికి సంబంధించి సేకరించిన ధాన్యం బకాయిలు రూ. 1, 468.94 కోట్లను విడుదల చేయాలని కేంద్రమంత్రికి వినతిపత్రం సమర్పించారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ. 343. 27 కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 

ఇక సీఎంఆర్ డెలివరీ గడువును పొడిగించాలని కేంద్రమంత్రిని రేవంత్ కోరారు. సీఎం రేవంత్  వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు.  ప్రస్తుతం  సీఎం రేవంత్‌, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర మంత్రులను కలుస్తూ తెలంగాణకు సంబంధించిన సమస్యలను విన్నవిస్తున్నారు. తమ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని కేంద్ర మంత్రులకు విన్నవిస్తున్నారు.

నిన్న సీఆర్‌ పాటిల్‌తో భేటీ..
కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న(సోమవారం) భేటీ అయ్యారు.  రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ చర్చించారు. సీఎం వెంట తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం, భీమా ఎత్తిపోతల పథకం, ఎస్సారెస్పీ స్టేజి -2కు సంబంధించి భూసేకరణ, వివాదాలు  18,189 కోట్ల రూపాయల పెండింగ్ పనులు గురించి రేవంత్ చర్చించినట్లు తెలుస్తోంది.

ప్రధానంగా కృష్ణా జలాల అంశంపై కేంద్ర జలశక్తి మంత్రికి వివరించారు. దీనిపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా జలాలను ఏపీ అన్యాయంగా తరలించుకుపోతోందని, ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశం అనంతరం పేర్కొన్నారు. కృష్ణా నదీ జలాల వివాదంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement