
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ ఏర్పాటుచేసి మీడియా సమావేశానికి మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవడంపై వివాదం తలెత్తింది. దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) స్పందిస్తూ, అఫ్గాన్ మంత్రి మీడియా సమావేశంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ సమావేశానికి మహిళా జర్నలిస్టులను ముత్తఖీ ఆహ్వానించలేదంటూ పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపధ్యంలో విపక్షాలు మహిళా జర్నలిస్టులకు మద్దతుగా నిలిచాయి. ఈ క్రమంలోనే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనిపై స్పందిస్తూ వివరణ ఇచ్చింది.
శుక్రవారం విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో అఫ్గాన్ మంత్రి ముత్తఖీ ద్వైపాక్షిక చర్చలు జరిపిన తర్వాత ఆయన అఫ్గాన్ రాయబార కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అయితే దీనిలో పాల్గొనేందుకు వచ్చిన మహిళా జర్నలిస్టులను లోపలికి అనుమతించలేదు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ సమావేశానికి ఎంపిక చేసిన కొందరు పురుష జర్నలిస్టులు, అఫ్గాన్ రాయబార కార్యాలయ అధికారులు మాత్రమే హాజరయ్యారు. సమావేశంలో ముత్తఖీ భారతదేశం- అఫ్గాన్ సంబంధాలు, పరస్పర మానవతా సహాయం, వాణిజ్య విధానాలు, భద్రతా సహకారం తదితర ప్రాంతీయ అంశాలపై మాట్లాడారు.
Prime Minister @narendramodi ji, please clarify your position on the removal of female journalists from the press conference of the representative of the Taliban on his visit to India.
If your recognition of women’s rights isn’t just convenient posturing from one election to…— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 11, 2025
మహిళా జర్నలిస్టులను అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి అహ్వానించకపోవడంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఈ ఉదంతంపై తీవ్రంగా స్పందించారు. దీనిని భారతీయ మహిళా జర్నలిస్టులకు జరిగిన అవమానంగా పేర్కొన్నారు. దీనిపై ప్రధాని మోదీ తమ వైఖరిని స్పష్టం చేయాలని ప్రియాంక గాంధీ వాద్రా డిమాండ్ చేశారు. ఇదేవిధంగా మాజీ కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ఈ సంఘటనపై స్పందిస్తూ.. తోటి మహిళా జర్నలిస్టులకు మద్దతుగా పురుష జర్నలిస్టులు ప్రెస్ మీట్ను బహిష్కరించి ఉంటే బాగుండేదని అన్నారు.

I am shocked that women journalists were excluded from the press conference addressed by Mr Amir Khan Muttaqi of Afghanistan
In my personal view, the men journalists should have walked out when they found that their women colleagues were excluded (or not invited)— P. Chidambaram (@PChidambaram_IN) October 11, 2025
ఈ ఘటన హాస్యాస్పదంగా ఉన్నదని చిదంబరం పేర్కొన్నారు. తాలిబన్ల వివక్షపూరిత విధానాలకు భారత ప్రభుత్వం అనుమతించిట్లు ఉన్నదన్నారు. ఇందుకు సహకరించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. కాగా అఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం మహిళలపై పలు ఆంక్షలు విధించింది. ఇటీవల అఫ్ఘనిస్తాన్ విశ్వవిద్యాలయానికి చెందిన మహిళలు రాసిన పుస్తకాలను కూడా నిషేధించింది. మహిళా సామాజిక శాస్త్రం, మానవ హక్కులు, అఫ్ఘన్ రాజ్యాంగ చట్టం-ప్రపంచీకరణ- అభివృద్ధి తదితర 18 కోర్సులను కూడా రద్దు చేసింది.