కోల్‌కతా ఘటన: మాట మార్చిన నిందితుడు.. అక్కడ సీబీఐ సోదాలు | CBI Reached RG Kar Medical College Sandip Ghosh Residence | Sakshi
Sakshi News home page

కోల్‌కతా ఘటన: మాట మార్చిన నిందితుడు.. అక్కడ సీబీఐ సోదాలు

Aug 25 2024 9:50 AM | Updated on Aug 25 2024 10:06 AM

CBI Reached RG Kar Medical College Sandip Ghosh Residence

కోల్‌కతా: బెంగాల్‌లోని ఆర్జీ కార్‌ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌ హత్యాచార కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక, కేసులో పలు ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఈ కేసులో నిందితుడు సంజయ్‌ రాయ్‌.. జైలులో గార్డులతో చెప్పిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. తనకూ ఈ కేసులో ఎలాంటి సంబంధంలేదని చెప్పడం సంచలనంగా మారింది.

కాగా, ఆర్జీ కార్‌ ఆసుపత్రిలో డాక్టర్‌ హత్యచార కేసులో సంజ​య్‌ రాయ్‌ను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, విచారణ సందర్భంగా సంజయ్ రాయ్‌ తన నేరాన్ని అంగీకరించాడు. ఆ రోజు ఏం జరిగిందో అంతా వివరించాడు. కానీ, తాజాగా జైలు గార్డులతో మాత్రం మరోలా చెప్పడం గమనార్హం. అసలు ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. పేరు చెప్పడానికి ఇష్టపడని జైల్ అధికారులు ఈ విషయం  వెల్లడించారు. అంతకుముందు కూడా.. తనకు ఈ నేరానికి ఎలాంటి సంబంధం లేదని కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాను నిర్దోషిని అంటూ అందుకే లై డిటెక్టర్ టెస్ట్‌కి అంగీకరించానని కోర్డులో జడ్జ్ ముందే చెప్పాడు.

అయితే, హత్యాచార ఘటన సమయంలో సెమినార్ రూమ్‌ వైపు ఎందుకు వెళ్లావ్ అని పోలీసులు ప్రశ్నించగా.. సంజయ్‌ దానికి సమాధానం చెప్పలేదు. పొంతన లేని సమాధానాలు చెప్పి విచారణ అధికారులను తప్పుదోవ పట్టించాలని చూశాడు. క్రైమ్‌ సీన్‌లో తెల్లవారుజామున 4.03 గంటలకు కనిపించాడుతన ముఖంపై గాయాల గురించి విచారిస్తే సరైన బదులు ఇవ్వడం లేదని పోలీసు అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. ఆగస్టు 24వ తేదీనే(శనివారం) సంజయ్‌కు పాలిగ్రఫీ టెస్ట్ చేయాల్సి ఉండగా..కొన్ని కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో, నేడు ఆదివారం(ఆగస్టు 25) ఈ టెస్ట్ నిర్వహించేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. ప్రస్తుతానికి జైల్‌లో ఉన్న సంజయ్ రాయ్‌ని అక్కడే ఉంచి ఈ టెస్ట్ చేయాలని భావిస్తున్నారు. అతని సెల్‌ వద్దే సీసీ కెమెరాలు పెట్టారు. నిఘా పెంచారు.

మరోవైపు.. ఆర్జీ కార్‌ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో భారీగా ఆర్థిక అవకతవకలు భారీగా జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ ప్రొ. సందీప్ ఘోష్‌పై సీబీఐ శనివారం కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం సీబీఐ అధికారులు.. సందీప్‌ ఘోష్‌కు సంబంధించిన ఇళ్లు, పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో సీబీఐ బృందాలు తనిఖీలు మొదలుపెట్టాయి. 

Advertisement
 
Advertisement
Advertisement